వెళ్లొస్తం లింగమయ్యా..
ABN , Publish Date - Apr 24 , 2024 | 11:37 PM
నల్లమల అభయారణ్యంలో వెలిసిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాల్లో భాగంగా పౌర్ణమి రోజు మంగళవారం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలొచ్చారు. పౌర్ణమిన స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి, కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ముగిసిన సలేశ్వరం జాతర ఉత్సవాలు
గత ఏడాది కంటే తగ్గిన భక్తులు
అచ్చంపేట, ఏప్రిల్ 24: నల్లమల అభయారణ్యంలో వెలిసిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాల్లో భాగంగా పౌర్ణమి రోజు మంగళవారం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలొచ్చారు. పౌర్ణమిన స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి, కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే పండు వెన్నెల్లో కట్టెలు చేత పట్టుకొని కొండలు ఎక్కుతూ, లోయలు దిగుతూ స్వామిని దర్శనం చేసుకున్నారు. అయితే గతేడాది కంటే ఈ సారి భక్తుల సంఖ్య తగ్గింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఈ మూడు రోజుల్లో దాదాపు 80 వేల మంది భక్తులు సలేశ్వరానికి వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సలేశ్వరం క్షేతానికి ప్రత్యేక బస్సులు నడిపింది. గత ఏడాది అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి రోజుకు 23 బస్సుల ద్వారా 69 ట్రిప్పులు నడిపేతే.. ఈ ఏడాది అవే 23 బస్సుల ద్వారా మూడు రోజుల్లో 36 ట్రిప్పులు నడిపించారు. పౌర్ణమి రోజు మంగళవారం, చివరి రోజు బుధవారం భక్తులు తక్కువగా రావడంతో దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. ఉత్సవాలు బుధవారం ముగియడంతో భక్తులు పోయొస్తం లింగమయ్య అంటూ వెనుదిరిగారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభమైన జాతర 24తో ముగిసింది. దక్షిణ అమరనాఽథ్ యాత్రగా పిలుస్తున్న ఈ సలేశ్వరం క్షేత్రంలో ఏర్పాట్లు అంతంత మాత్రంగా ఉండటం, గడిచిన రెండేళ్లుగా ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలతో ఈ సారి భక్తుల సంఖ్య తగ్గింది. అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏడాదిలో తొమ్మిది నెలలు లింగమయ్య దర్శనం కోసం అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తుండటం కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి కారణాలుగా తెలుస్తోంది.