Share News

ఉల్లిగడ్డ విక్రయం పేరిట బురిడీ

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:17 AM

తక్కువ ధరకు ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నామంటూ గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తున్న కొందరు నకిలీ నోట్లు ఇస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.

ఉల్లిగడ్డ విక్రయం పేరిట బురిడీ
నకిలీ వంద రూపాయల నోటు

వృద్ధులే లక్ష్యంగా నకిలీ నోట్లు

చేర్యాల, ఏప్రిల్‌ 22: తక్కువ ధరకు ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నామంటూ గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తున్న కొందరు నకిలీ నోట్లు ఇస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తెల్లవారుజామునే గ్రామాల్లోకి వచ్చి వాహనంలో ఉల్లిగడ్డలు విక్రయిస్తూ గంటల వ్యవధిలోనే వెళ్లిపోతున్న క్రమంలో వృద్ధులనే ఎంచుకుని నకిలీ నోట్లు అందించి మోసం చేస్తున్నారు. అందుకు చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన నిదర్శనం. కడవేరుగుకు చెందిన ఓ వృద్ధురాలు సోమవారం గ్రామానికి వచ్చిన ఓ వ్యాపారి వద్ద ఉల్లిగడ్డ కొనుగోలు చేసి రూ.200 నోటు ఇచ్చింది. అతడు రూ.100 నోటుతో పాటు మిగతా చిల్లరను ఆమెకు ఇచ్చాడు. కొద్దిసేపటి తరువాత సెల్‌ఫోన్‌ రీచార్జి చేసుకునేందుకు వృద్ధురాలు గ్రామంలోని ఓ కిరాణా దుకాణానికి వెళ్లి రూ.100 నోటు ఇచ్చింది. తీరా అది చిన్నపిల్లలు ఆటాడుకునే నకిలీ నోటుగా దుకాణ యజమాని గుర్తించాడు. ఎవరు ఇచ్చారని అడగడంతో ఉల్లిగడ్డ అమ్మిన వారు ఇచ్చారని తెలిపి ఖంగుతింది.. విషయం తెలిసిన చుట్టుపక్కలవారు వెతకగా అప్పటికే సదరు వ్యాపారి గ్రామం నుం చి ఉడాయించాడు. ఈ విషయమై మరింతమంది మోసపోకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయం కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Updated Date - Apr 23 , 2024 | 12:17 AM