చేనేత రంగంలో మహిళలు రాణించాలి
ABN , Publish Date - Apr 22 , 2024 | 11:47 PM
సిద్దిపేటరూరల్, ఏప్రిల్ 22: చేనేత ఉత్పత్తుల రంగంపై మహిళలు ఆసక్తి చూపించాలని రాష్ట్ర జౌళి, చేనేతశాఖ కమిషనర్ అలుగు వర్షిణి సూచించారు.
చేనేత, జౌళిశాఖ రాష్ట్ర కమిషనర్ అలుగు వర్షిణి
సిద్దిపేటరూరల్, ఏప్రిల్ 22: చేనేత ఉత్పత్తుల రంగంపై మహిళలు ఆసక్తి చూపించాలని రాష్ట్ర జౌళి, చేనేతశాఖ కమిషనర్ అలుగు వర్షిణి సూచించారు. సోమవారం సిద్దిపేటలో పర్యటించిన ఆమె చేనేత సహకార సంఘాలను సందర్శించారు. ఇటీవల సిద్దిపేటకు చెందిన 18 మంది మహిళలు చీరనేయడంపై శిక్షణ పొందేందుకు ప్రముఖ చేనేత గ్రామమైన చీరాలను సందర్శించారు. వారితో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు అక్కడ నేర్చుకున్న అంశాలను, ఇంకా వారికి అవసరమైన శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. రెండోదశలో మరి కొంతమందిని ఎంపికచేసి వారికి కూడా నాణ్యమైన చేనేత ఉత్పత్తుల తయారీకి మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు కమిషనర్ వివరించారు. అనంతరం సిద్దిపేట ప్రత్యేక చీరలైన గొల్లభామ, రామప్ప చీరలు నేసిన కార్మికులను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వంద నెంబర్ గల నూలు వస్త్రాలను నేయాలని, చీరల తయారీలో నాణ్యత పాటించాలని సూచించారు. త్వరలోనే మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి చేనేత రంగంలో మహిళల పాత్ర పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఫ్యాషన్ టెక్నాలజీ చాంబర్ ఆఫ్ కామర్స్ చేనేత, జౌళిశాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేనేత రంగాన్ని ఉత్పత్తులను పెంపొందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, చేనేత శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్, రతన్కుమార్, ఏడీ సంతో్షకుమార్, ఏడీఏ ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.