రాజధానిలో 103 ఏళ్ల వైద్యురాలు కన్నుమూత!
ABN , First Publish Date - 2020-08-31T12:09:43+05:30 IST
దేశరాజధాని ఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పద్మావతి(103) కన్నుమూశారు. ఆమె అవివాహితురాలు. కార్డియాలజిస్ట్గా డాక్టర్ పద్మావతి...
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పద్మావతి(103) కన్నుమూశారు. ఆమె అవివాహితురాలు. కార్డియాలజిస్ట్గా డాక్టర్ పద్మావతి 1950 నుంచి ఢిల్లీలో వైద్యసేవలు అందిస్తూ వస్తున్నారు. డాక్టర్ పద్మావతి రంగూన్ మెడికల్ కాలేజీతో పాటు ఇంగ్లాండ్లో మెడికల్ డిగ్రీ తీసుకున్న అనంతరం ఢిల్లీకి వచ్చారు. దేశ మొదటి ఆరోగ్యశాఖ మంత్రి రాజ్కుమారి అమృత్ కౌర్ డాక్టర్ పద్మావతి గురించి తెలుసుకుని, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అధ్యాపకురాలిగా ఆమెను నియమించారు. డాక్టర్ పద్మావతి ఆ కాలేజీలో తరగతులలో పాల్గొంటూనే, వైద్య సేవలు అందిస్తూ వచ్చారు.
1976లో ప్రభుత్వం మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్-డైరెక్టర్గా డాక్టర్ పద్మావతిని నియమించింది. అక్కడ ఆమె హృదయ సంబంధిత వ్యాధుల పరిశోధనల్లో పాల్గొన్నారు. హిందీ, తమిళం, ఇంగ్లీషు భాషలను అనర్గళంగా మాట్లాడే డాక్టర్ పద్మావతి వైద్య రంగంలో విశేష సేవలు అందించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదుర్శాస్త్రి, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజపేయి తదితరులకు ఆమె వైద్య సేవలు అందించారు. జూన్ 11న డాక్టర్ పద్మావతి పుట్టినరోజున ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు వైద్య విద్యార్థులు వచ్చేవారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్చేసి, అందరి యోగక్షేమాలు తెలుసుకునేవారు. డాక్టర్ పద్మావతి ఢిల్లీలోని కొన్నివేలమందికి వైద్య సేవలు అందించారు.