తోట త్రిమూర్తులుపై దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2020-04-29T16:40:35+05:30 IST

రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై ..

తోట త్రిమూర్తులుపై దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం

కత్తులతో నరికిన ఆరుగురు దుండగులు..

కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు


కె.గంగవరం(తూర్పు గోదావరి): రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి చేసిన మేడిశెట్టి ఇజ్రాయిల్‌పై మంగళవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. ఫిబ్రవరి 19న ద్రాక్షారామలోని సాయి మాధవ ఫంక్షన్‌ హాలులో వైసీపీ సీనియర్‌ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో తోట త్రిమూర్తులుపై ఇజ్రాయిల్‌ దాడి చేశాడు. ఇతడి స్వగ్రామం కె.గంగవరం మండలం మసకపల్లి. ఇజ్రాయిల్‌ మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో మసకపల్లి ఏటిగట్టుపై ఫోను మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేశారు. మెడపైన, ఎడమ భుజంపైన విచక్షణారహితంగా నరికివేశారు. గాయాలపాలైన అతడిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కాకినాడ జీజీహెచ్‌ తరలించారు. 


ఆరుగురు దాడి చేశారు: డీఎస్పీ

రామచంద్రపురం: మసకపల్లి ఏటుగట్టుపై మంగళవారం రాత్రి మేడిశెట్టి ఇజ్రాయిల్‌పై హత్యాయత్నం జరిగిందని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. రాత్రి ఏడు గంటల సమయంలో ఇజ్రాయెల్‌కు అతని స్నేహితుడు రాజు కాజులూరు మండలం గొల్లపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు గురించి మాట్లాడాలని ఏటిగట్టు వద్దకు రావాలని ఫోన్‌ చేశాడు. ఇజ్రాయెల్‌ ఏటుగట్టుపైకి వెళ్లగా అక్కడ ఉన్న రవ్వా నాగభూషణం మరో ఆరుగురు వ్యక్తులు కత్తులతో నరికినట్టు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2020-04-29T16:40:35+05:30 IST