అంతా మీవల్లే... డిగ్గీరాజాపై కమల్‌నాథ్ ఫైర్

ABN , First Publish Date - 2020-05-01T22:36:26+05:30 IST

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు.

అంతా మీవల్లే... డిగ్గీరాజాపై కమల్‌నాథ్ ఫైర్

భోపాల్ : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ, జ్యోతిరాదిత్య సింధియా చేస్తున్న కుట్రలు తనకు తెలుసని, అయితే ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్‌ను విడిచి వెళ్లరని దిగ్విజయ్ సింగ్ చేసిన తప్పుడు ప్రచారంతో తన ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోయానని సంచలన వ్యాఖ్యలు చేశారు.


‘‘రోజుకు మూడు సార్లు ఎమ్మెల్యేలు డిగ్గీరాజాతో మాట్లాడేవారు. వారు ఎటూ వెళ్లరని ఆయన భావించారు. కానీ వారు వెళ్లిపోయారు. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాకపోవచ్చు కానీ, అప్పటి పరిస్థితులను అంచనా వేయడంలో ఘోరంగా విఫలం చెందాం’’ అని కమల్ వ్యాఖ్యానించారు.


‘‘జూలై నుంచే సింధియా బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారన్న విషయం నాకు తెలుసు. కాంగ్రెస్ సాధారణ కార్యకర్త ముందు లక్ష ఓట్ల తేడాతో భారీ అపజయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.’’ అని కమల్‌నాథ్ అన్నారు. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి రావడం రాష్ట్ర నాయకత్వానికి సుతారమూ ఇష్టం లేదని ఆయన తెలిపారు. అయితే ఎలాగైనా మధ్యప్రదేశ్ నుంచి రెండో రాజ్యసభ సీటు కావల్సిందేనని బీజేపీ పట్టుపట్టడంతో సింధియాను పార్టీలో చేర్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? అన్న అంశంపై స్పందిస్తూ... అదంతా నెంబర్ గేమ్ అని  కమల్ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-05-01T22:36:26+05:30 IST