‘పోలవరానికి 55,548 కోట్లూ ఇవ్వాల్సిందే’
ABN , First Publish Date - 2020-11-19T10:17:23+05:30 IST
కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55, 548 కోట్లకు
విజయవాడ, నవంబరు 18: కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55, 548 కోట్లకు కేంద్రం ఆమోదం తెలపాల్సిందేనని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణంపై బుధవారమిక్కడ విజయవాడ ప్రెస్క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రైతుసేవా సంస్థ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. నిర్వాసితులకు న్యాయం చేయాలని, భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం, సహాయ, పునరావాస కార్యక్రమాలను అవినీతి, అక్రమాలకు తావులేకుండా పోలవరం ప్రాజెక్టు అథారిటీ అమలు చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. గోదావరి ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా కేంద్ర జలసంఘం ఆమోదించిన ప్రకారం.. ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని స్పష్టం చేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అక్కినేని భవానీప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ, రైతుసంఘాల నాయకులు యెర్నేని నాగేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.’