రాజధానిపై దాడి చేస్తున్నారు
ABN , First Publish Date - 2020-06-19T10:05:50+05:30 IST
‘దేశ సరిహద్దుల్లో చైనా దాడి చేస్తుంది... ఇక్కడ అమరావతిపై వైసీపీ దాడి చేస్తోంది.. రెండింటికీ తేడా ఏముంది...? రెండూ దేశ ..
184వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతుల ఆవేదన
ఆవేదనతో అగిన మరో రైతు గుండె
గుంటూరు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ‘దేశ సరిహద్దుల్లో చైనా దాడి చేస్తుంది... ఇక్కడ అమరావతిపై వైసీపీ దాడి చేస్తోంది.. రెండింటికీ తేడా ఏముంది...? రెండూ దేశ భూభాగాలే కదా’ అంటూ రాజధాని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారానికి 184వ రోజుకు చేరాయి. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఇంటింటా అమరావతి కార్యక్రమం కింద వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాగా, శాసనమండలిలో అమరావతి, సీఆర్డీఏ బిల్లుల అంశం, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది.
పార్లమెంట్లో గళం వినిపిస్తా : ఎంపీ గల్లా
తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గురువారం రైతులతో సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ... పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైతే అమరావతి ఉద్యమంపై తిరిగి గళం వినిపిస్తానని స్పష్టంచేశారు. రెండు రోజులుగా రాష్ట్ర శాసనసభలో జరుగుతున్న పరిణామాలు, పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను తిరిగి ప్రవేశపెట్టటంపై మనోవేదనకు గురై అనంతవరం గ్రామానికి చెందిన చింకా సాంబయ్య (49) గురువారం గుండెపోటుతో మృతి చెందారు.