న్యాయదేవతే రక్ష!
ABN , First Publish Date - 2020-08-18T09:47:32+05:30 IST
న్యాయదేవతే రక్ష!
- పేదల ఇళ్లు, ఆర్5 జోన్పై సుప్రీం తీర్పు హర్షణీయం
- రాజధాని రైతుల వెల్లడి
- 244వ రోజు కొనసాగిన ఆందోళన
గుంటూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఎవరు ఎన్ని కుట్రలు చేసినా న్యాయదేవతే తమను రక్షిస్తుందని రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు నినదించారు. అమరావతి రాజధానిని తరలించ వద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు సోమవారం 244వ రోజు కొనసాగాయి. మొత్తం 29 గ్రామాల్లో రైతులు, మహిళలు రోడ్ల మీదకి వచ్చి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించడం హర్షణీయమని ఆనందం వ్యక్తం చేశారు. రాత్రి ఏడు గంటల తర్వాత ‘అమరావతి వెలుగు’ కార్యక్రమంలో కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి ప్రభుత్వానికి వ్యతిరేకరంగా నినాదాలు చేశారు.