కరెన్సీ లెక్కింపులో కరోనా ప్రమాదం!
ABN , First Publish Date - 2020-03-21T09:43:38+05:30 IST
ఇప్పటి వరకు కరోనా వైరస్ కేవలం మనుషులను తాకటం ద్వారా, వారు సంచరించిన ప్రదేశాల్లోని వస్తువులను తాకటం ద్వారా విస్తరిస్తుందని, వాటికి దూరంగా ఉంటే సరిపోతుందని భావిస్తూ వస్తున్నాం.
- ఆర్థిక శాఖను హెచ్చరించిన సీఏఐటీ
గుంటూరు(సంగడిగుంట), మార్చి 20: ఇప్పటి వరకు కరోనా వైరస్ కేవలం మనుషులను తాకటం ద్వారా, వారు సంచరించిన ప్రదేశాల్లోని వస్తువులను తాకటం ద్వారా విస్తరిస్తుందని, వాటికి దూరంగా ఉంటే సరిపోతుందని భావిస్తూ వస్తున్నాం. కానీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ ) ఆర్థిక శాఖను హెచ్చరిస్తూ చేసిన సూచన ఇప్పుడు మరింత కలవరానికి దారి తీసింది. అదే నోట్ల లెక్కింపు! కొన్ని చోట్ల డబ్బు లెక్కించడానికి స్పాంజ్తో కూడిన ప్యాడ్లను వాడతారు. వాటిపై నీటిని చల్లి ఆ తడితో నోట్లు లెక్కిస్తారు. కానీ 90 శాతం మంది నోటితో తడి చేసుకొని నగదు లెక్కిస్తారు. ఇది భారత్ వంటి దేశాల్లో సాధారణం. ఇప్పుడిప్పుడే ఆన్లైన్ బ్యాంకింగ్ విస్తరిస్తున్నప్పటికీ అది కేవలం 3 శాతానికి మించలేదు. అంటే 97ు నగదు చేతుల మీదే లెక్కిస్తున్నారు. వీటిని లెక్కించే క్రమంలో ఒకవేళ కరోనా సోకిన వ్యక్తి నోటితో తడి చేసుకొని నోట్లను లెక్కిస్తే కరోనా కారకం ఎన్ని గంటలు ఉంటుందో ఇప్పటికీ స్పష్టత లేదు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా మూడు రోజుల క్రితం విడుదల చేసిన సర్వేలో అన్ని వస్తువులపై 9 గంటల్లో వైరస్ చనిపోదని నిర్ధారించింది. కరెన్సీ నోట్లపై ఎన్ని గంటలు ఉంటుందనేది ఇప్పటి వరకు అధ్యయనం జరగలేదు. కాబట్టి వీలైనంత వరకు ఫోన్పే, గూగుల్పే వంటి మాధ్యమాలను వాడాలని నిపుణులు చెబుతున్నారు.