జనతా కర్ఫ్యూ గొప్ప నిర్ణయం.. కేంద్రంపై సమరం ప్రశంసల జల్లు
ABN , First Publish Date - 2020-03-21T21:48:44+05:30 IST
చైనా, ఇటలీ పరిస్థితులను చూశాకా.. దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని డాక్టర్ సమరం అన్నారు.
విజయవాడ: చైనా, ఇటలీ పరిస్థితులను చూశాకా.. దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని డాక్టర్ సమరం అన్నారు. కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం మంచి పరిణామమన్నారు. జనతా కర్ఫ్యూ గొప్ప నిర్ణయమని కేంద్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటివి చేపడితేనే సురక్షితంగా ఉంటామన్నారు. ఈ జబ్బు ఈ దేశంలో పుట్టింది కాదని.. అక్కడి వారి ఆహార అలవాట్లు.. ఇక్కడి వారి ఆహార అలవాట్లలో తేడా ఉందన్నారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు వచ్చిందన్నారు. నోరు, ముక్కు, కళ్ల ద్వారా వస్తుందని.. అక్కడి మనుషులు ముద్దులిచ్చుకోవడం, ఆలింగనాలు చేసుకుంటారని.. మన సంస్కృతిలో అలా ఉండదన్నారు. మనవాళ్లు కాళ్ల మీద పడతారని చెప్పుకొచ్చారు. మనుషులను మానసికంగా సిద్ధం చేస్తున్నారని.. చేతులు శుభ్రంగా ఉంటే కరోనా రాదని చెప్పారు. జనతా కర్ఫ్యూతో అందరికీ అవగాహన కలుగుతుందని.. చైతన్యం తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నారు. భయం, అభద్రతా భావన అందరిలో నెలకొందన్నారు. ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. ఎయిడ్స్ నియంత్రణలో చక్కని ప్రణాళికలు రచించి ప్రభుత్వం పెద్దఎత్తున అదుపు చేసిందన్నారు. అలాగే ఇప్పుడు కూడా మన దేశం మళ్లీ నెంబర్ అవుతోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి నిర్ణయం తీసుకున్నారని.. గవర్నమెంట్ చెప్పింది చేయండని ప్రజలకు సూచించారు.