కనిష్ఠం 35 వేలు, గరిష్ఠం 70 వేలు
ABN , First Publish Date - 2020-03-18T09:59:24+05:30 IST
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజులు ఖరారయ్యాయి. కనిష్ఠంగా రూ.35 వేలు, గరిష్ఠంగా రూ.70 వేలను నిర్ణయిస్తూ ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు
- ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు ఖరారు
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజులు ఖరారయ్యాయి. కనిష్ఠంగా రూ.35 వేలు, గరిష్ఠంగా రూ.70 వేలను నిర్ణయిస్తూ ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుల కంటే భారీగా తగ్గించడం గమనార్హం. రాష్ట్రంలో 287 ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా.. అన్ని కాలేజీలకు వాటి స్థాయిలను బట్టి కమిషన్ ఫీజులను సిఫారసు చేసింది. ఈ మేరకు మంగళవారం కమిషన్ సెక్రెటరీ ఎన్.రాజశేఖరరెడ్డి సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీశ్చంద్రకు నివేదికను సమర్పించారు. ఈ ఫీజులు 2019-20 విద్యాసంవత్సరానికి మాత్రమే అమలు కానున్నాయి. నివేదికలోని కీలక అంశాలు..
- కళాశాలల నైపుణ్యం, సామర్థ్యంతో పనిలేకుండా గరిష్ఠ ఫీజును రూ.70 వేలుగా నిర్ణయించారు.
- 190 కాలేజీలకు రూ.35 వేలు కనిష్ఠ ఫీజు.
- 38 కాలేజీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజు కంటే తక్కువగా గరిష్ఠ ఫీజును నిర్ణయించారు.
- 12 కాలేజీలకు 2012-13లో నిర్ణయించిన ఫీజుల కంటే కూడా ఇప్పుడు తగ్గించారు.
- దాదాపు 21 కాలేజీలకు రూ.60,000-70,000 గరిష్ఠ ఫీజుగా సిఫారసు చేశారు.
‘భారం’ నుంచి తప్పించుకున్నారా?
వాస్తవానికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యాజమాన్యాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. కానీ భారీగా కోత పెట్టడంతో కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నాయి. చట్టబద్ధత ఉన్న కమిషన్ స్వతంత్రంగా పనిచేయకుండా సర్కారు చెప్పిందే వేదంగా భావించి కోతపెట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజులు పెంచితే రీయింబర్స్మెంట్ ద్వారా ఖజానాపై భారం పడుతుందని సర్కారు భావించినట్టు తెలుస్తోందని, ఈ నేపథ్యంలోనే ఫీజులను అసాధారణంగా తగ్గించేశారనే వాదన వినిపిస్తోంది.