ఈసీ కూడా జగన్ హిట్లిస్టులోకి వచ్చింది: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-03-15T23:10:57+05:30 IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాపై సీఎం జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని చంద్రబాబు అన్నారు. జగన్ ఎవరు చెప్పినా వినరనడానికి ఇదే ఉదాహరణ అని చంద్రబాబు విమర్శించారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని,కరోనా గ్లోబల్ వైరస్గా మారింది..147 దేశాలకు పాకిందని చంద్రబాబు అన్నారు. లక్ష మందికిపైగా కరోనా వైరస్బారిన పడ్డారని, కరోనాతో ఇప్పటికే ఐదు వేల మందికి పైగా చనిపోయారని చంద్రబాబు స్పష్టం చేశారు. కరోనా వైరస్ను.. డబ్ల్యూహెచ్వో మహమ్మారిగా ప్రకటించిందని బాబు అన్నారు. చైనా, ఇటలీలో ఆస్పత్రులు, మెడికల్ షాపులు తప్ప అన్నీ మూసేశారని పేర్కొన్నారు.
కరోనా వైరస్ను కేంద్రం విపత్తుగా ప్రకటించిందని, నేపాల్, భూటాన్ నుంచి రాకపోకలు నిలిపివేశారని చంద్రబాబు తెలిపారు. ఆరు రాష్ట్రాల్లో షట్డౌన్ చేశారని, కరోనాపై జగన్ ఒక్క రోజు కూడా సమీక్ష చేయలేదన్నారు. 60 ఏళ్ల వాళ్లకే కరోనా వస్తుందని చెబుతారా? అని చంద్రబాబు మండిపడ్డారు. కరోనా వస్తే పారాసిటమాల్ వేస్తే తగ్గిపోతుందంటున్నారని, మీ చేతగానితనానికి ఇదే నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేని తనమని చంద్రబాబు విమర్శించారు. నీ అక్కసు అంతా వెళ్లగక్కుతున్నారని, ప్రజలను ఎడ్యుకేట్ చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు సీఎంకు లేదని, సీఎం తమాషా ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా గురించి సీఎంకు కనీస అవగాహన లేదని, ఇది రాష్ట్రం దురదృష్టమన్నారు. ఇతని అహంభావం రాష్ట్రానికి శాపంగా మారిందని, సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ సీఎం సొంత వ్యవహారం కాదని, ఇష్టారాజ్యాంగా మాట్లాడడం సరికాదని చంద్రబాబు అన్నారు.
మాట్లాడితే 151 సీట్లు గెలిచామంటారని, ఎవడిచ్చారు మీకు సర్వాధికారమని చంద్రబాబు విమర్శించారు. ఇష్ట ప్రకారం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే అధికారం మీకు లేదన్నారు. ఎన్నికల కమిషన్కు స్వయంప్రతిపత్తి ఉంటుందని, గత ఎన్నికల ముందు అధికారులను..పోలీసులను తప్పించలేదా? లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈసీని కూడా బెదిరిస్తారా.. ఈసీ కూడా జగన్ హిట్లిస్టులోకి వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల నియమాలు అన్ని పార్టీలకు ఒకేలా ఉంటాయని, సీఎంకు రాజకీయాలు తప్ప ప్రజారోగ్యం పట్టదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. లండన్లో కూడా స్థానిక ఎన్నికలు నిలిపివేశారని చంద్రబాబ వెల్లడించారు.