ఇక ‘కృష్ణపట్నం’ అదానీదే
ABN , First Publish Date - 2020-09-05T09:44:43+05:30 IST
కృష్ణపట్నం పోర్టు నిర్వహణ ఇక అదానీ గ్రూపు చేపట్టనుంది. పోర్టులోని 75 శాతం వాటాను ఈ గ్రూపు ..
75% వాటా బదిలీకి రాష్ట్రం ఓకే
మంత్రివర్గం ఆమోద ముద్ర: మేకపాటి
అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణపట్నం పోర్టు నిర్వహణ ఇక అదానీ గ్రూపు చేపట్టనుంది. పోర్టులోని 75 శాతం వాటాను ఈ గ్రూపు కొనుగోలు చేయడం.. కొనుగోలు ఒప్పందాన్ని నెలన్నర క్రితం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించడం తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభు త్వం కూడా తుది ఆమోదం తెలిపినట్లు పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. మంత్రివర్గం ఈ వాటా బదిలీకి ఆమోదముద్ర వేసిందని శుక్రవారమిక్కడ వెల్లడించారు. కృష్ణపట్నం పోర్టును నిర్మించి, నిర్వహించి, బదిలీ చేసే పద్ధతిలో 2008-2009లో సీవీఆర్ గ్రూపునకు కేటాయించారు. 30ఏళ్లపాటు ఇది ప్రైవేటు కంపెనీ చేతుల్లో ఉండి.. ఆ తర్వాత ప్రభుత్వానికి బదిలీ చే యాలి. అయితే ఈ లీజును ఆటోమేటిగ్గా తొలి ద ఫా పదేళ్లు, మలిదఫా పదేళ్లు పెంచుతారు. అంటే మొత్తం 50 ఏళ్లపాటు ప్రైవేటు కంపెనీ నిర్వహించుకున్నాక ప్రభుత్వానికి అప్పగించాలి.
ఆ పద్ధతి లో సీవీఆర్ గ్రూపు కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ సంస్థ (కేపీసీఎల్)ను ఏర్పాటుచేసి దీనిని నిర్మించింది. ఈ పోర్టులో 75 శాతం వాటాను రూ. 13,572 కోట్లకు అదానీ కొనుగోలు చేసింది. ఇందు లో కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకు పైగా రుణం కూడా కలిసి ఉంది. ఈ రుణాన్ని అదానీ చెల్లించేలా, రుణం పో ను మిగతా మొత్తాన్ని కేపీసీఎల్కు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. కృష్ణపట్నం పోర్టు దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేటు పోర్టు కావడం విశేషం.
మారిటైమ్ బోర్డు చైర్మన్గా మేకపాటి
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ డెవల్పమెంట్ బోర్డు చైర్మన్గా మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బోర్డు సభ్యుల నియామకాన్ని సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి.