నేడు సూర్య గ్రహణం!
ABN , First Publish Date - 2020-06-21T09:08:06+05:30 IST
ఆదివారం... అమావాస్య... అంతేకాదు, కంకణ సూర్యగ్రహణం కూడా! ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఉదయం 10.37 ..
మూడున్నర గంటలపాటు గ్రహణకాలం
ప్రధాన ఆలయాలన్నీ మూసివేత
కృష్ణానదిలో భక్తుల స్నానాలపై నిషేధం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): ఆదివారం... అమావాస్య... అంతేకాదు, కంకణ సూర్యగ్రహణం కూడా! ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఉదయం 10.37 గంటలకు గ్రహణం మొదలవుతుంది. మధ్యాహ్నం 1.37 గంటల వరకు ఉంటుంది. అంటే... మూడున్నర గంటలపాటు గ్రహణ కాలం ఉంటుంది. కర్నూలులో 11.52 గంటలకు, విజయవాడలో 12.03 గంటలకు, విశాఖపట్నంలో 12.14 గంటలకు గరిష్ఠ స్థాయిలో సూర్యుడిని చంద్రుడు కప్పేస్తాడు. నాసా లెక్కల ప్రకారం చంద్రుడు సూర్యుడిని 99.4శాతం...అంటే దాదాపుగా సంపూర్ణంగా అడ్డుకుంటాడు. ఈ సమయంలోనే సూర్యుడు ’కంకణం’లాగా కనిపిస్తాడు. 2020లో వస్తున్న మొదటి సూర్యగ్రహణమిది. డిసెంబరు 14న మరోసారి సూర్యగ్రహణం వస్తుందని ఏపీ సైన్స్సిటీ సీఈఓ డాక్టర్ జయరామిరెడ్డి తెలిపారు. సూర్యగ్రహణం కారణంగా ఆదివారం తిరుమల సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో దర్శనాలను రద్దుచేశారు.
శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం గ్రహణం వీడిన తర్వాత 2.30 గంటలకు తలుపులు తెరిచి శుద్ధి, కైంకర్యాలు, ఏకాంత సేవ అనంతరం 8.30 గంటలకు మూసివేస్తారు. తిరిగి సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లోనూ ఆదివారం దర్శనాలు ఉండవు. కాగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కృష్ణానదిలో పుణ్యస్నానాలను విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు నిషేధించారు.
తిరుమలలో పెరుగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ నెల 11 నుంచి దర్శనాలు ప్రారంభించగా 19వ తేదీ నుంచి అదనంగా రోజుకు మరో 3వేల టికెట్లు జారీ చేస్తుండటంతో శుక్రవారం 8,105 మంది దర్శనం చేసుకోగా, శనివారం 10,093 మంది శ్రీవారిసేవలో పాల్గొన్నారు.