మృతుల కుటుంబాలకు.. స్వయంగా ఎక్స్గ్రేషియా ఇవ్వండి
ABN , First Publish Date - 2020-05-11T10:11:23+05:30 IST
విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం లేదని.. గ్యాస్ ప్రభావం లేదని తేలాకే సమీప ప్రాంత గామాల ప్రజలను వెనక్కి రప్పించాలని సీఎం వైఎస్
- నేటి ఉదయమే వారి వద్దకు వెళ్లండి
- సాయం కోసం ఎవరూ తిరగకూడదు
- గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో.. మంత్రులు రాత్రి బస చేయాలి
- స్టైరిన్ విశాఖలో ఉండేందుకు వీల్లేదు
- ట్యాంకుల్లో ఉన్నదంతా వెనక్కి పంపండి: సీఎం జగన్ ఆదేశం
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం లేదని.. గ్యాస్ ప్రభావం లేదని తేలాకే సమీప ప్రాంత గామాల ప్రజలను వెనక్కి రప్పించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. Styrene gas leakage accidentపై ఆదివారమిక్కడ తాడేపల్లిలోని తన నివాసం నుంచి రెండు సార్లు సమీక్ష జరిపారు. విశాఖలోనే ఉన్న ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. మరణించినవారి కుటుంబాలను మంత్రులు, అధికారులు సోమవారం ఉదయం కలిసి.. ప్రకటించిన ఎక్స్గ్రేషియాను అందించాలని ఆదేశించారు.
ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం కోసం వారు ఎక్కడా తిరగకూడదని.. వలంటీర్ల ద్వారా సదరు సాయాన్ని డోర్డెలివరీ చేయాలని నిర్దేశించారు. తమకు అందాల్సిన సాయం కోసం ప్రజలెవరూ పదే పదే కోరే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. బాధితులకూ, గ్రామస్తులకూ మంచి సదుపాయాలు అందేలా చూడాలన్నారు. స్టైరిన్ ప్రభావిత గ్రామాల్లో సోమవారం నుంచి ముమ్మరంగా శానిటైజేషన్ చేయాలని, ఇంటా బయటా ఎక్కడా రసాయన అవశేషాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాక.. సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేఆలా చూడాలని స్పష్టం చేశారు. వారికి ధైర్యం చెప్పడానికి మంత్రులు ఆయా గ్రామాల్లో రాత్రి బస చేయాలని నిర్దేశించారు. ఇంతటి ప్రమాదానికి కారణమైన స్టైరిన్ రసాయనాన్ని విశాఖలో ఉంచడానికి వీల్లేదని సీఎం తేల్చిచెప్పారు. ట్యాంకుల్లో, ఇతర చోట్ల ఉన్న స్టైరిన్ను వెనక్కి పంపాలని ఆదేశాలిచ్చారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని ఈ పని పూర్తిచేయాలన్నారు.