వివేకానందరెడ్డి సమాధికి నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ
ABN , First Publish Date - 2020-03-15T15:24:12+05:30 IST
దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెంది సరిగ్గా అవుతోంది. ఈ సందర్భంగా పులివెందులలోని ఆయన సమాధికి వైఎస్ విజయమ్మ..
కడప: దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెంది ఏడాది అయింది. ఈ సందర్భంగా పులివెందులలోని ఆయన సమాధికి వైఎస్ విజయమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఆయనను గుర్తు చేసుకుని ప్రత్యేక పార్థనలు చేశారు.
కాగా వైఎస్ వివేకానంద మృతి ఇంకా మిస్టరీగానే ఉంది. 2019 మార్చి 15న తన స్వగృహంలోనే వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఆయన ‘గుండెపోటు’తో మరణించారని తొలుత ప్రచారం జరిగింది. రక్తపు మరకలను తుడిచేయడం, కుటుంబ సభ్యులు రాకమునుపే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం వంటి అనేక ‘అనుమానాస్పద’ చర్యలతో ఈ కేసు పెను సంచలనం సృష్టించింది.
నెలలు గడుస్తున్నా కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీత న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. విచారించిన న్యాయస్థానం ఈ నెల 11న సీబీఐకి కేసును అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.