అనిల్ అంబానీ దివాలా కేసులో చైనా బ్యాంకులకూ నోటీసులు
ABN , First Publish Date - 2020-10-13T07:12:39+05:30 IST
అనిల్ అంబానీ దివాలా కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మిమ్మల్ని కూడా ఎందుకు పార్టీలుగా చేర్చకూడదో చెప్పాలని ఢిల్లీ హైకోర్డు మూడు చైనా బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది...
న్యూఢిల్లీ : అనిల్ అంబానీ దివాలా కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మిమ్మల్ని కూడా ఎందుకు పార్టీలుగా చేర్చకూడదో చెప్పాలని ఢిల్లీ హైకోర్డు మూడు చైనా బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. అంబానీ తన వ్యక్తిగత ఆస్తులు పూచీగా పెట్టి తన నిర్వహణలోని ఆర్కామ్ కోసం 2012లో ఈ మూడు బ్యాంకుల నుంచి 70 కోట్ల డాలర్లు రుణాలుగా తీసుకున్నారు. ఈ ఆస్తులు అమ్మి మరీ ఈ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించాలని ఈ ఏడాది మే నెలలో లండన్ కోర్టు తీర్పు ఇచ్చింది.
మరోవైపు ఎస్బీఐ కూడా అనిల్ అంబానీ నుంచి రావాల్సిన బకాయిల వసూలు కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. అయితే ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రుణ వసూళ్ల కోసం అంబానీ హామీగా పెట్టిన ఆస్తులు అమ్మవద్దని హైకోర్టు ఎస్బీఐని ఆదేశించింది. ఇదే ఉత్తర్వులు చైనా బ్యాంకులకూ ఇవ్వాలని అంబానీ కోరారు. దీంతో దీనిపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలని ఢిల్లీ హైకోర్టు అనిల్ అంబానీకి అప్పులిచ్చిన చైనా బ్యాంకులను కోరింది. లండన్ కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తే ఎస్బీఐ బకాయిలు చెల్లించేందుకు పైసా కూడా మిగలదని హైకోర్టుకు తెలిపారు.