భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
ABN , First Publish Date - 2020-07-20T06:38:54+05:30 IST
కరెంట్ ఖాతా లోటుకు ప్రధాన సవాలుగా నిలిచే బంగారం దిగుమతులు ఇటీవల కాలంలో భారీగా పడిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పసిడి దిగుమతులు ఏకంగా 94 శాతం క్షీణించి 68.8 కోట్ల డాలర్లకు...
న్యూఢిల్లీ: కరెంట్ ఖాతా లోటుకు ప్రధాన సవాలుగా నిలిచే బంగారం దిగుమతులు ఇటీవల కాలంలో భారీగా పడిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పసిడి దిగుమతులు ఏకంగా 94 శాతం క్షీణించి 68.8 కోట్ల డాలర్లకు (రూ.5,160 కోట్లు) పడిపోయాయి. కొవిడ్-19 కారణంగా బంగారం డిమాండ్ గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం దిగుమతులు 1,150 కోట్ల డాలర్ల (రూ.86,250 కోట్లు) మేరకు ఉన్నాయి.
వెండి దిగుమతులు కూడా ఇదే స్థాయిలో తగ్గాయి. గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలంతో పోల్చితే అవి 45 శాతం తగ్గి 57.7 కోట్ల డాలర్లకు (రూ.4,300 కోట్లు) పడిపోయాయి. బంగా రం, వెండి దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు ఇదే త్రైమాసికంగా 4,596 కోట్ల డాలర్ల నుంచి 912 కోట్ల డాలర్లకు తగ్గింది. సాధారణంగా భారత్ ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. కాగా ఏప్రిల్-జూన్ కాలంలో వజ్రాభరణాల ఎగుమతులు 72 శాతం క్షీణించి 270 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.