మంత్రి మల్లారెడ్డి కాలేజీకి ‘న్యాక్’ షాక్
ABN , First Publish Date - 2020-12-26T19:54:45+05:30 IST
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కాలేజీకి నేషనల్ అసె్సమెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) షాకిచ్చింది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(ఎంఆర్సీఈ)పై నిషేధం విధించింది
మోసపూరిత చర్యలకు పాల్పడినందుకు ఐదేళ్లు నిషేధం
బీహెచ్ఈఎల్, ఎయిర్టెల్ పేర్లతో నకిలీ పత్రాలు
మరో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీపైనా దర్యాప్తు?
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కాలేజీకి నేషనల్ అసె్సమెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) షాకిచ్చింది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(ఎంఆర్సీఈ)పై నిషేధం విధించింది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్), ప్రైవేటు టెలికాం సంస్థ ఎయిర్టెల్, ఐటీ కంపెనీ యష్ టెక్నాలజీస్ పేరిట నకిలీ పత్రాలు సమర్పించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయంతో రంగారెడ్డి జిల్లా మైసమ్మగూడలోని ఎంఆర్సీఈకి ఐదేళ్లవరకు న్యాక్ గుర్తింపు లభించదు. చివరిసారిగా 2018లో ప్రకటించిన న్యాక్ గ్రేడింగ్లో ఈ కళాశాలకు బి++ గ్రేడింగ్ కేటాయించారు. ఏ++ గ్రేడింగ్ సాధించాలన్న లక్ష్యంతో సెల్ఫ్ స్టడీ రిపోర్ట్(ఎ్సఎ్సఆర్)లో ఎంఆర్సీఈ తప్పుడు పత్రాలను సమర్పించింది. బోధన, పరిశోధన, సౌకర్యాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాల ఆధారంగా న్యాక్ ప్రతి ఐదేళ్లకోసారి గ్రేడింగ్లు ఇస్తుంది. ప్రవేశాలు పొందే ముందు విద్యార్థులకు, క్యాంపస్ ప్లేస్మెంట్ చేపట్టే ముందు కార్పొరేట్ కంపెనీలకు న్యాక్ గ్రేడింగే ప్రామాణికం.
గ్రేడింగ్ కేటాయింపు ఇలా..
ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలతోపాటు ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్ ప్రతి ఐదేళ్లకోసారి గ్రేడింగ్ కేటాయిస్తుంది. కనీసం రెండు బ్యాచ్లు పూర్తిచేసుకున్న, లేదా ఆరేళ్లు పూర్తిచేసుకున్న విద్యా సంస్థ న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యలో నాణ్యతాప్రమాణాలు పాటిస్తుండటం, అర్హత కలిగిన బోధకులు, పరిశోధనలు, క్యాంపస్ ప్లేస్మెంట్లు, ఎంఎన్సీలతో ఒప్పందాలు తదితర అంశాల ఆధారంగా క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(సీజీపీఏ)ను మూడు దశల్లో కేటాయిస్తారు. మొదటిదశలో విద్యాసంస్థలే ఎస్ఎ్సఆర్ను సమర్పించాలి. ఇందులో కళాశాల బలాలు, ప్రత్యేకతలను వివరించాలి. వీటి ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 2019 డిసెంబరు 13న సమర్పించిన ఎస్ఎ్సఆర్లో మూడు ప్రముఖ సంస్థల పేరుతో నకిలీ పత్రాలు సమర్పించిందని న్యాక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ్.. కాలేజీకి రాసిన లేఖలో తెలిపారు.
ఆయా సంస్థల లెటర్హెడ్లు, స్టాంపులు, సంతకాలు నకిలీవని తేలిందని ఆయన స్పష్టం చేశారు. కళాశాల సమర్పించిన ఎస్ఎ్సఆర్ను తిరస్కరించామని, కళాశాలను బ్లాక్ లిస్ట్లో చేర్చామని పేర్కొన్నారు. దీంతో ఐదేళ్ల పాటు న్యాక్ గుర్తింపు ఉండదని వివరించారు. శుక్రవారం న్యాక్ ఈ వివరాలను తన అధికారి వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అలాగే ఎస్ఎ్సఆర్లో నకిలీ పత్రాలు సమర్పించారన్న అనుమానంతో నగరంలోని మరో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీపైనా న్యాక్ విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.