ఇంటర్లో ఉత్తీర్ణులైనవారంతా ఉపకార వేతనాలకు అర్హులే
ABN , First Publish Date - 2020-11-06T16:27:39+05:30 IST
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్స్ రెన్యువల్ విద్యార్థులకు అర్హత నిబంధనలను కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): నేషనల్ మెరిట్ స్కాలర్షిప్స్ రెన్యువల్ విద్యార్థులకు అర్హత నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. గతంలో ప్రతిభ ఆధారంగా వీటిని మంజూరు చేసేవారు. ఈసారి ఉత్తీర్ణులైన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ విద్య కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. గతంలో ఉపకార వేతనాలు పొంది 2020-21లో ఇంటర్ ఉత్తీర్ణులైన వారంతా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, ఇది ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో ఇంటర్ రెగ్యులర్, ఫెయిలై పాసైనవారు, గైర్హాజరై పాసైనవారందరూ రెన్యవల్ కోసం http://scholarships.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి మాత్రం ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. గత మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన 52,740 విద్యార్థుల వివరాలను బోర్డు అధికారిక వెబ్సైట్లో ఉంచామన్నారు. వీరంతా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.