కువైట్లో 679 మంది భారతీయులకు కరోనా !
ABN , First Publish Date - 2020-04-14T17:02:36+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ కువైట్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఆదివారం ఒక్కరోజే కువైట్లో 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కువైట్ సిటీ: మహమ్మారి కరోనా వైరస్ కువైట్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఆదివారం ఒక్కరోజే కువైట్లో 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కువైట్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1234కి చేరింది. ఇక ఆదివారం నమోదైన 80 కొత్త కేసుల్లో 45 మంది భారతీయులు ఉన్నారు. ఈ 45 మందితో కలిపి ఆ దేశంలో 'కొవిడ్-19' సోకిన భారతీయులు 679 మంది అయ్యారని ఆరోగ్యశాఖ మంత్రి షేక్ బాసిల్ అల్ సబా తెలిపారు. రోజురోజుకీ ఈ మహమ్మారి బారిన పడుతున్న ఎన్నారైల సంఖ్య పెరుగుతోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 1091 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 29 మంది ఐసీయూలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
ఇదిలాఉంటే తమ దగ్గర పనిచేసే భారత్కు చెందిన ఓ వ్యక్తి 'కొవిడ్-19' బారిన పడ్డాడని కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ తెలిపింది. మరో 42 విదేశీయులను క్వారంటైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇక కువైట్లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యాధికంగా ఇండియన్స్ ఉంటున్నారు. కువైట్లోని ఫర్వానియా, సల్మియా, ఫహహీల్, జెలీబ్ అల్-షుయౌఖ్, మహబౌలా తదితర ప్రాంతాల్లో విదేశీయులు అధికంగా నివాసముంటారు. ఇప్పుడు ఈ ప్రాంతాలే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. లాక్డౌన్ విధించిన జెలీబ్ అల్ షుయౌఖ్, అబ్బాసియా ప్రాంతాలలో కొంతమంది మలయాళీలకు 'కొవిడ్-19' సోకిందనే అనుమానంతో టెస్టుల కోసం వారి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. ఈ వైద్యపరీక్షల రిపోర్టు వచ్చిన తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తిని బట్టి అవసరమనుకుంటే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి షేక్ బాసిల్ అల్ సబా తెలియజేశారు.