భారతీయుడి మరణానికి కారణమైన యువతికి ఏడేళ్ల జైలుశిక్ష
ABN , First Publish Date - 2020-03-05T01:01:43+05:30 IST
భారతీయుడి మరణానికి కారణమైన నిందితురాలికి ఆస్ట్రేలియా కోర్టు బుధవారం ఏడేళ్ల జైలుశిక్షను విధించింది.
సిడ్నీ: భారతీయుడి మరణానికి కారణమైన నిందితురాలికి ఆస్ట్రేలియా కోర్టు బుధవారం ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జతిందర్ బ్రార్(25) అనే భారతీయుడు పైచదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. ఒకపక్క చదువుకుంటూనే జతిందర్ సూపర్మార్కెట్లో ట్రక్ డ్రైవర్గానూ పనిచేసేవాడు. అయితే గతేడాది జనవరి నాలుగో తేదీన సోఫీ లూయిజ్ బ్రైన్(27) అనే ఆస్ట్రేలియాకు చెందిన యువతి డ్రగ్స్ మత్తులో దొంగిలించిన కారులో వేగంగా వెళ్తూ జితిందర్ ట్రక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జతిందర్ ప్రాణాలు విడిచాడు.
జతిందర్ను ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా సోఫీ అక్కడి నుంచి తప్పించుకోవాలని అతివేగంగా వెళ్లడానికి ప్రయత్నించగా.. ఆస్ట్రేలియా పోలీసులు చివరకు ఆమెను హెలికాప్టర్ ద్వారా పట్టుకున్నారు. కాగా.. సోఫీ తాను చేసిన నేరాన్ని కోర్టులో అంగీకరించింది. ఏడాది నుంచి ఈ కేసు కోర్టులోనే ఉండగా.. బుధవారం సోఫీకి ఏడేళ్ల జైలుశిక్షను విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. అంతేకాకుండా సోఫీ డ్రైవింగ్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో.. సోఫీ జైలు నుంచి విడుదలైన తరువాత కూడా కోర్టు అనుమతిచ్చిన తరువాతే డ్రైవింగ్ చేయాలని ఆదేశించింది.