స్వీయ దిగ్బంధం దిశగా గల్ఫ్ దేశాలు..!
ABN , First Publish Date - 2020-03-19T08:49:08+05:30 IST
కరోనా కంపనాలు ఎడారులకు నెలవైన గల్ఫ్ దేశాలనూ తాకాయి. గల్ఫ్ ప్రాంతంలో తొలి కరోనా మరణం బహ్రెయిన్లో నమోదైన నేపథ్యంలో ఇతర గల్ఫ్ దేశాలూ స్వీయ దిగ్బంధం దిశగా అడుగులువేస్తున్నాయి. దీంతో ఇక్కడ భారీ సంఖ్యలో పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు అగమ్యగోచర పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు..
గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి: కరోనా కంపనాలు ఎడారులకు నెలవైన గల్ఫ్ దేశాలనూ తాకాయి. గల్ఫ్ ప్రాంతంలో తొలి కరోనా మరణం బహ్రెయిన్లో నమోదైన నేపథ్యంలో ఇతర గల్ఫ్ దేశాలూ స్వీయ దిగ్బంధం దిశగా అడుగులువేస్తున్నాయి. దీంతో ఇక్కడ భారీ సంఖ్యలో పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు అగమ్యగోచర పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. గల్ఫ్లో పెద్ద దేశమైన సౌదీ అరేబియా సోమవారం(మార్చి 16) నుంచి 16 రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలువు ప్రకటించడంతో పాటు దేశంలోని అన్ని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఇతర బహిరంగ ప్రదేశాలను నిరవధికంగా మూసివేయించింది.
ఒమాన్ కూడా తమ సరిహద్దులను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. విమానాల రాకపోకలను నిషేధిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని దుబాయి ఖండించింది. కాగా, మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో సగానికి పైగా దుబాయి పర్యటనకు వెళ్లి వచ్చిన 40 మంది వల్లే వ్యాపించాయని సాక్షాత్తూ అక్కడి అధికారవర్గాలు వెల్లడించడంతో కలకలం రేగింది. కువైత్, ఖతర్, సౌదీ అరేబియా, మరియు ఒమాన్ దేశాలు విమానాల రాకపోకలను రద్దు చేయడంతో భారత్ నుంచి కూరగాయల దిగుమతి పూర్తిగా నిలిచిపోయింది.