160 మంది తెలుగు వారిని బహిష్కరించిన కువైత్
ABN , First Publish Date - 2020-03-21T15:09:59+05:30 IST
కరోనా మహమ్మారిని నిరోధించడంలో భాగంగా కువైత్ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను అరెస్టు చేసి వారిని వారి స్వదేశాలకు పంపిస్తోంది. ఈ క్రమంలో కువైత్లో ఇటీవల అరెస్టయిన సుమారు 350 మంది భారతీయులను కువైత్ పోలీసులు శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో భారతదేశానికి పంపిస్తున్నారు.
కరోనా నిరోధానికి ప్రభుత్వ నిర్ణయం
అందరూ ఏపీ వారే.. కడప వాళ్లే ఎక్కువ
(గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా మహమ్మారిని నిరోధించడంలో భాగంగా కువైత్ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను అరెస్టు చేసి వారిని వారి స్వదేశాలకు పంపిస్తోంది. ఈ క్రమంలో కువైత్లో ఇటీవల అరెస్టయిన సుమారు 350 మంది భారతీయులను కువైత్ పోలీసులు శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో భారతదేశానికి పంపిస్తున్నారు. ఈ విమానం శనివారం ఉదయం ముంబైకి చేరుకుంటుంది. స్వదేశానికి పంపించిన 350 మంది భారతీయుల్లో ఏపీకి చెందినవారే 160 మంది ఉన్నారు. ఇందులో అత్యధికులు కడప జిల్లాకు చెందిన వారున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇండియాకు వెళ్తున్న వారిలో కడప జిల్లా చెన్నూరుకు చెందిన రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ పాపను తల్లి ఆస్పత్రిలోనే వదిలివేసి పారిపోగా కువైత్ పోలీసులు ఆ తల్లిని అరెస్టు చేసి జైలులో ఉంచారు. ప్రస్తుతం తల్లి, పాప ఇద్దరూ ప్రత్యేక విమానంలో ఇండియాకు వెళ్లనున్నారు. కువైత్ నుంచి విమానాల రాకపోకలు రద్దయినప్పటికీ కువైత్ అమీర్(రాజు) ప్రత్యేక అనుమతితో ఈ విమానం బయల్దేరుతోంది. ముంబైలో ఈ 350 మందిని 14 రోజుల పాటు క్వారెంటైన్లో పెడతారని భావిస్తున్నారు.