ఎన్నారైలకు షాకింగ్ అనుభవం.. గతంలో గొప్పగా చూసినోళ్లే..!
ABN , First Publish Date - 2020-03-21T20:57:29+05:30 IST
మా అబ్బాయి విదేశాల్లో చదువుకుంటున్నాడు. సెలవులకు వస్తున్నాడు.. మా అల్లుడు, కూతుళ్లు విదేశాల్లో స్థిరపడి స్వదేశానికి వస్తున్నారు.. అంటూ ఇలా కుటుంబసభ్యులు ఆనందంగా ఇతరులకు చెప్పుకునేవారు. వారి రాకకోసం వారు ఎంతో హడావుడి చేస్తూ, ఎయిర్పోర్టుకి వెళ్లి ఘనంగా స్వాగతం పలికి ఇంటికి తీసుకువచ్చేవారు. ఇదంతా గతం.
- విదేశీ భయం...!
- ఫారెన్నుంచి వస్తున్నారంటే అప్పట్లో ఆనందం.. ఇప్పుడు బెరుకు
- కరోనా ప్రభావంతో స్థానికుల్లో ఆందోళన
- స్వగ్రామాలకు చేరుకుంటున్న వలస వాసులు
- విమానాశ్రయాల్లో స్ర్కీనింగ్ టెస్ట్లు
కాకినాడ (ఆంధ్రజ్యోతి): మా అబ్బాయి విదేశాల్లో చదువుకుంటున్నాడు. సెలవులకు వస్తున్నాడు.. మా అల్లుడు, కూతుళ్లు విదేశాల్లో స్థిరపడి స్వదేశానికి వస్తున్నారు.. అంటూ ఇలా కుటుంబసభ్యులు ఆనందంగా ఇతరులకు చెప్పుకునేవారు. వారి రాకకోసం వారు ఎంతో హడావుడి చేస్తూ, ఎయిర్పోర్టుకి వెళ్లి ఘనంగా స్వాగతం పలికి ఇంటికి తీసుకువచ్చేవారు. ఇదంతా గతం. ఇప్పుడు విదేశాలనుంచి స్వదేశానికి వస్తున్నామంటూ కబురు తెలిసిన మరక్షణమే ఆ కుటుంబసభ్యులతోపాటు పరిసర ప్రాంతాలవారి గుండెల్లో ఏదో తెలియని భయం.. ఆందోళన.. సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్న వారిని సంతోషంగా ఆహ్వానం పలకలేక, వద్దని చెప్పలేక సతమతమవుతున్నారు. కరోనా వైరస్ ఎఫెక్ట్తో ఈ పరిస్థితి నెలకొంది.
ఇతర దేశాల నుంచి 1200మంది రాక
విదేశాల నుంచి గత నెలనుంచి ఇప్పటివరకు జిల్లాకు 1200మందికిపైబడి వచ్చారు. రాజమహేంద్రవరం, కాకినాడ సహా కోనసీమ ప్రాంతానికి చెందివారు అధికంగా ఉన్నారు. ఉన్నత విద్యాభ్యాసం, ఉపాధి అవసరాలు నిమిత్తం ప్రపంచంలోని వివిధ దేశాలకు జిల్లా నుంచి వలసల బాటపట్టారు. గల్ఫ్ సహా వివిధ దేశాలనుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలివచ్చారు. గత 15రోజులనుంచి విదేశాలనుంచి వచ్చినవారి సమాచారం తెలుసుకున్న వైద్యఆరోగ్యశాఖ అధికారులు వారిని ఇళ్ల వద్దే నిర్బంధంలో ఉంచి వారి ఆరోగ్యపరిస్థితులపై నిఘా పెట్టారు.
అనుమానిత లక్షణాలున్న కొందరు కాకినాడ జీజీహెచ్కు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారు. గల్ఫ్దేశాలైన కువైట్, ఖతర్, దుబాయ్, మస్కట్, సౌదీఅరేబియా, ఇరాన్, ఇరాక్లతోపాటు సింగపూర్, మలేషియా, ఇటలీ, లండన్, అమెరికా, చైనా, పిలిఫ్పీన్స్ వంటి అనేక దేశాలకు ఉపాధి, ఉన్నత విద్యకోసం జిల్లానుంచి వేలసంఖ్యలో వెళ్లారు. అధిక సంఖ్యాకులు మాత్రం కోనసీమనుంచి గల్ఫ్దేశాలకే ఎక్కువ వెళ్లారు.
కాకినాడ రూరల్లో 32మంది
కాకినాడ రూరల్ మండలానికి చెందిన పలువురు జీవనోపాఽధి కోసం దుబాయ్, ఖతర్, సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ కొంతకాలం పనిచేసి స్వస్థలాలకు వచ్చారు. మరి కొందరు వివాహాది శుభకార్యాల కోసం కాకినాడ రూరల్ మండలంలోని తమ స్వస్థలాలకు మొత్తం 40మంది చేరుకున్నారు. గతంలో అయితే వీరందరికీ కుటుంబ సభ్యులు ఎదురేగి ఘనస్వాగతం పలికేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. కరోనా వైరస్ ప్రభావంతో ఎయిర్పోర్టులో స్ర్కీనింగ్ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇంటికి చేరుకుంటున్నారు.
విమానంలో 10 నుంచి 16 గంటల ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎదురవుతున్న పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నారు. ఏ కొద్దిపాటి దగ్గు, తుమ్ములు, జ్వరం వచ్చినా ఫలానా వారి ఇంటికి కుమారుడు, అల్లుడు, కూతురు వచ్చారంటూ రహస్యంగా వీరి సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అధికారులు ఇంటికి చేరుకోవడం, వివిధ రకాల పరీక్షలు చేయడం, ఇంటినుంచి రెండు వారాలపాటు బయటకు రావద్దు అని చెప్పడం, ఒకవేళ బయటకు వేస్తే కేసులకు గురికాక తప్పదంటూ చెప్పడంతో ఖంగుతింటున్నారు.
ఆరోగ్యపరిస్థితిపై రోజువారీ పరిశీలన
ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర దేశాలు వెళ్లి స్వస్థలాలకు తిరిగిచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నాం. కరోనా వైరస్ లక్షణాలు లేకపోయినా 28 రోజులపాటు క్యారంటైన్లో స్వచ్ఛందంగా ఉండాలని వారికి చెబుతున్నాం. నిత్యం ఆరోగ్య సిబ్బంది ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నాం. స్వచ్ఛందంగా ఇంట్లో ఉండకపోతే 180 యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతున్నాం.
అనారోగ్యం ఉంటే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్తానంటే అంగీకరించకపోయిన వారిని పోలీసుల సాయంతో ఐసోలేషన్ వార్డుకు తరలిస్తామని చెప్పి ప్రభుత్వ ఉత్తర్వు కాపీలను అందించాం. మండలంలో ఇద్దర్ని వైద్య పరీక్షలకోసం, అబ్జర్వేషన్ కోసం జీజీహెచ్కు తరలించాం. ఇంకా రిపోర్టు రాలేదు.
- -నారాయణరావు, పండూరు పీహెచ్సీ వైద్యాధికారి