నువ్వు ఔట్ అయిన బెస్ట్ బాల్ ఇదేనా..కోహ్లీపై ఈసీబీ పోస్ట్
ABN , First Publish Date - 2020-05-09T21:22:09+05:30 IST
లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం క్రికెట్ గ్రౌండ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే తమ ఫ్యాన్స్ను...
లండన్: లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం క్రికెట్ గ్రౌండ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే తమ ఫ్యాన్స్ను దగ్గరయ్యేందుకు ఆన్లైన్ లైవ్ ఇంటర్వ్యూలు, వీడియో చాటింగ్లు చేస్తున్నారు కొందరు క్రికెటర్లు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం కోహ్లీని టార్గెట్ చేస్తూ ఓ వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 2018లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మూడు వన్డేల సిరీస్లో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఔటైన వెంటనే విరాట్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరాడు. ఈ వీడియోను ఇప్పుడు పోస్ట్ చేసిన ఈసీబీ ‘నువ్వు ఔటైన బెస్ట్ బాల్ ఇదేనా..?’ అంటూ కోహ్లీకి టాగ్ చేసింది. దీనిపై కోహ్లీ ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే అప్పటివరకు ఏనాడూ స్పిన్నర్లకు ఓట్ అవ్వని కోహ్లీ ఆ సిరీస్లో మూడు సార్లూ స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు. మూడో మ్యాచ్లో అద్భుతమైన బంతితో కోహ్లీని పెవిలియన్ పంపిన రషీద్ మొదటి మ్యాచ్లోనూ కోహ్లీ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో మ్యాచ్లో కోహ్లీ వికెట్ను మొయీన్ అలీ సాధించాడు. అప్పటికి చెరో మ్యాచ్ గెలిచిన భారత్, ఇంగ్లాండ్లకు మూడో మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అయితే కోహ్లీతో పాటు సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్ల వికెట్లను తీసి రషీద్ భారత్ను గట్టి దెబ్బ తీశాడు. దీంతో 256 పరుగులకే ఇండియా కుప్పకూలింది. 8 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ సిరీస్ను కూడా కైవసం చేసుకుంది.