ఇంట్లో ఉంటేనే ఆరోగ్యం
ABN , First Publish Date - 2020-03-21T10:12:43+05:30 IST
ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న కరోనా నుంచి బయటపడాలంటే అందరూ స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య..
కోహ్లీ, అనుష్క సందేశం
ముంబై: ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న కరోనా నుంచి బయటపడాలంటే అందరూ స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ సూచించారు. కోహ్లీతో కలిసి రూపొందించిన వీడియోను అనుష్క తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అటు విరాట్ కూడా దీన్ని ట్విటర్లో రీట్వీట్ చేశాడు. ‘మన దేశమే కాకుండా ప్రపంచమంతా ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. దీన్ని అరికట్టాలంటే ఇంట్లోనే ఉండండి. అలాగైతేనే భద్రంగా, ఆరోగ్యంగానూ ఉంటాం’ అని తెలిపారు.
జనతా కర్ఫ్యూకు క్రికెటర్ల మద్దతు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన జనతా కర్ఫ్యూకు క్రికెటర్లు పూర్తి మద్దతు పలికారు. విరాట్ కోహ్లీ, యువరాజ్, హర్భజన్, రాహుల్, రిషభ్ పంత్ ఇది గొప్ప నిర్ణయంగా పేర్కొన్నారు. అందరూ ఉదయం నుంచి రాత్రి వరకు స్వచ్ఛందంగా ఇళ్లల్లోనే ఉంటూ జనతా కర్ఫ్యూకు మద్దతు ఇవ్వాలని కోరారు. కరోనా నియంత్రణలో పోరాడుతున్న వ్యక్తుల కోసం ఆదివారం సాయంత్రం చప్పట్లతో మద్దతు పలకాలని సూచించారు.