ఆసియాక్పను వదులుకోం..
ABN , First Publish Date - 2020-06-19T10:02:12+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం తాము ఆసియాకప్ టీ20 టోర్నీని వదులుకోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ను జరిపే ఆలోచన ఉన్నట్టు ఇటీవల బీసీసీఐ
కరాచీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం తాము ఆసియాకప్ టీ20 టోర్నీని వదులుకోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ను జరిపే ఆలోచన ఉన్నట్టు ఇటీవల బీసీసీఐ వెల్లడించింది. అయితే ఇంతకుముందే ప్రకటించిన ఆసియాకప్ షెడ్యూల్ కూడా అదే సమయంలో ఉండడం పీసీబీకి ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే ఐపీఎల్ కోసం తమ టోర్నీని ఎలా వాయిదా వేసుకుంటామని ప్రశ్నిస్తోంది. అదీగాకుండా ఈ టోర్నమెంట్ ద్వారా తమకు, ఇతర బోర్డులకు ఆదాయం లభిస్తుందని, ఐపీఎల్ జరిగితే బీసీసీఐకి మాత్రమే లాభమని గుర్తుచేసింది. ‘షెడ్యూల్ ప్రకారం కాకుండా ఆసియాకప్ జరిగేలా చర్చలు సాగుతున్నాయని విన్నాను. కానీ అది సాధ్యం కాదు. కేవలం ఒక్క దేశం కోసం ఈ టోర్నీని ముందుకు జరపడం సరికాదు. అందుకే ఐపీఎల్ కోసం మేం వెనక్కితగ్గడమంటూ ఉండదు. అయినా ప్రేక్షకులు లేకుండా టీ20 ప్రపంచకప్ కూడా జరిగే అవకాశం ఉంది. లేకపోతే ప్రతీ జట్టు 15 నుంచి 20 మిలియన్ డాలర్లు నష్టపోతుంది’ అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ తెలిపాడు.