శాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి బక్రీద్ స్ఫూర్తి: వెంకయ్య నాయుడు
ABN , First Publish Date - 2020-08-01T07:17:39+05:30 IST
శాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి బక్రీద్ స్ఫూర్తి: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ముస్లింలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం నాడు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి బక్రీద్ స్ఫూర్తిగా నిలుస్తోందని ఆయన గుర్తుచేశారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని, తదనుగుణంగా ముస్లింలు జాగ్రత్తగా సంబురాలు జరుపుకోవాలని ఆశించారు. వేడుక ఏదైనా.. భారతీయులందరూ కరోనా నిబంధనలు పాటించి, ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. కాగా, రాష్ట్రంలోని ముస్లింలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ను ముస్లింలంతా సంతోషంగా, ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ జరుపుకోవాలని అన్నారు. ఇస్లామిక్ విశ్వాసంలో బక్రీద్కు ప్రత్యేక స్థానం ఉందని ఆమె గుర్తుచేశారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయత, సహనాన్ని బక్రీద్ గుర్తుచేస్తుందని, అందరూ వాటిని పాటించాలని కోరారు. భక్తిశ్రద్థలతో జరుపుకునే పండుగల్లో బక్రీద్ ఒకటని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.