బలాలాపై కేసు పెట్టాలి: రాంచందర్రావు
ABN , First Publish Date - 2020-05-11T09:39:17+05:30 IST
బీజేపీ దళిత నాయకులు బంగారు శృతి, డాక్టర్ విజయరామారావులను ఉద్దేశపూర్వకంగా..
- దోషిని కఠినంగా శిక్షిస్తాం : హోంమంత్రి
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్: బీజేపీ దళిత నాయకులు బంగారు శృతి, డాక్టర్ విజయరామారావులను ఉద్దేశపూర్వకంగా అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యే బలాలాపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్రావు డిమాండ్ చేశారు. పాతబస్తీలో దళిత బాలికపై ఎంఐఎం కార్యకర్త అత్యాచారం చేస్తే, ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి తాము వెళ్లిన సందర్భంలో బలాలా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాంచందర్రావు ఆరోపించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని, బాలికపై అత్యాచారం చేసిన ఎంఐఎం కార్యకర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు తమ ఇళ్లలో ఆదివారం దీక్ష చేశారు. బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని రాంచందర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్వాన్ నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నేతలు వారి ఇళ్లలో ధర్నా చేశారు. చాదర్ఘాట్లో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఫాస్ట్-ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేసి దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో హన్మకొండ, శంషాబాద్లో జరిగిన ఘటనలను ప్రస్తావించిన ఆయన, అత్యాచారం చేసిన వారికి అదే తరహాలో శిక్షలుంటాయని హెచ్చరించారు.