కేంద్ర నిధులపై సర్పంచ్, ఉప సర్పంచ్కే చెక్పవర్
ABN , First Publish Date - 2020-03-19T10:38:11+05:30 IST
కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసే నిధుల చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్లకే
హైదరాబాద్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసే నిధుల చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్లకే చెక్పవర్ ఇచ్చారు. వీటిపైనా వారిరువురే సంతకాలు చేయాలి. కేంద్ర నిధుల చెక్కులపై ప్రభుత్వ ఉద్యోగి/లోకల్ అథారిటీ సంతకం ఉండాలన్న నిబంధన ఇప్పటివరకు ఉంది. కానీ, గ్రామ పంచాయతీలో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు చెక్ పవర్ను పంచాయతీరాజ్ చట్టం ద్వారా కల్పించారు. కార్యదర్శులకు చెక్ పవర్ లేదు. ఇదే నిబంధన కేంద్రం విడుదల చేసే 14వ ఆర్థిక సంఘం నిధులకూ వర్తిస్తుందని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్రావు తాజాగా ఆదేశాలు చేశారు. పంచాయతీల సొంత ఆదాయం, రాష్ట్ర నిధుల విడుదల చెక్కులపై ఇప్పటికే సంతకం హక్కు కోల్పోయిన పంచాయతీ కార్యదర్శులు తాజాగా కేంద్ర నిధులపైనా ఆ హక్కు కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర నిధులు, పంచాయతీ సొంత ఆదాయ నిదుల విడుదల చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు కార్యదర్శికి కూడా సంతకం(చెక్పవర్) కల్పించాలని, తద్వారా జవాబుదారీతనాన్ని పెంచాలని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.