జర్నలిస్టులను కరోనా వారియర్లుగా గుర్తించాలి
ABN , First Publish Date - 2020-10-03T11:04:25+05:30 IST
విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులు నిత్యం కరోనాతో పోరాడుతున్నారని, వారికి భద్రత కల్పించాలని ఇండియన్ ..
ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు దాసరి కృష్ణారెడ్డి
వరంగల్ అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబరు 2: విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులు నిత్యం కరోనాతో పోరాడుతున్నారని, వారికి భద్రత కల్పించాలని ఇండియన్ జర్నలిస్టు యూనియన్(ఐజేయూ) జాతీయ కార్యవర్గ సభ్యుడు దాసరి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండ పబ్లిక్గార్డెన్లోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో వాసుచంద్రకు వినతిపత్రం సమర్పించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే కొవిడ్ బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 12మంది జర్నలిస్టులు మృతిచెందగా, 1100 మంది కరోనాతో పోరాడుతున్నారని తెలిపారు.
వారితో పాటు 2,600 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులు వైరస బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సాయం అందించలేదన్నారు. కొవిడ్ వారియర్స్గా నిలిచిన జర్నలిస్టులకు రూ.50 వేల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా సోకిన జర్నలిస్టులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మధుగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లాల వెంకటరమణ, గడ్డం రాజిరెడ్డి, బోళ్ల అమర్, జిల్లా ప్రధానకార్యదర్శి కంకణాల సంతోష్ పాల్గొన్నారు.