విద్యుత్ దహన వాటికల మొరాయింపు..!
ABN , First Publish Date - 2020-08-16T10:19:22+05:30 IST
కరోనా కారణంగా రాష్ట్రంలో సాధారణంకంటే ఎక్కువగా మరణాలు నమోదవుతున్న కారణంగా..
- కొవిడ్ మరణాలతో పెరిగిన ఉపయోగం
- తరచూ మరమ్మతుల సమస్యలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా రాష్ట్రంలో సాధారణంకంటే ఎక్కువగా మరణాలు నమోదవుతున్న కారణంగా విద్యుత్ దహన వాటికలకు డిమాండ్ నెలకొంది. ఇన్నేళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్న విద్యుత్ దహన యంత్రాలన్నింటినీ ఒక్కసారిగా వాడటం మొదలైంది. దీంతో యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. రెండు వారాల క్రితం ఇవి అందుబాటులోకి రాగా.. ఇప్పటికే మూడు సార్ల వరకూ మరమ్మత్తులు చేశామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ మతాలకు చెందిన 900 శ్మశానవాటికలు ఉన్నాయి. అయితే.. కేవలం నాలుగు ప్రాంతాల్లోనే విద్యుత్ దహన వాటికల్ని ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపాలతో ఇవి చాలాకాలంగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. కరోనా కారణంగా సాధారణ శ్మశనాల్లో దహనాల్ని స్థానికులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చినా.. ఒక్కసారిగా పనిభారం పెరగడంతో అవి మొరాయిస్తున్నాయి. ఈ్సఐ, పంజాగుట్ట, అంబర్పేట, బన్సిలాల్పేటలో విద్యుత్ దహన వాటికలున్నాయి.
కరోనాకు పూ ర్వం వీటి వద్ద ప్రతి రోజు ఒకటో రెండో మృతదేహాల దహనం జరిగేది. కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం నిత్యం 4-8 మృతదేహాలను దహనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రోజుకు అనేక గంటల పాటు ఆగకుండా నడుస్తున్నందున యంత్రాలపై భారం బాగా పెరిగిందని వివరిస్తున్నారు. మృతదేహాన్ని దహనం చేసే క్రమంలో విద్యుత్తో వెలువడే మంటలతో యంత్రాలు వేడె క్కుతున్నాయి. ఇటీవల అంబర్పేట, బన్సిలాల్పేట దహ న వాటికల్లో యంత్రాలు పాడయ్యాయి. దీంతో ఒకరోజు దహనాలు నిలిచిపోయాయి. అంతకుముందు ఇతర దహన వాటికల్లో ఇబ్బందు లు తలెత్తాయి. ఈ క్రమంలోనే అధునాతన పరిజ్ఞానంతో కూడిన గ్యాస్ దహన యంత్రాల ఏర్పాటుపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. గ్యాస్తో నడిచే యంత్రం ఒకటి ఇప్పటికే తాజాగా పటాన్చెరుకు చేరింది. వారంలో నిర్మాణం పూర్తిచేసి యంత్రం ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీని కోసం రూ.90 లక్షలు ఖర్చవుతుందన్నారు.