ఈ ఏడాది డిగ్రీలో డిటెన్షన్ రద్దు
ABN , First Publish Date - 2020-04-18T11:31:44+05:30 IST
ఈ ఏడాది డిగ్రీలో డిటెన్షన్ రద్దు
తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): డిగ్రీ పరీక్షల నిర్వహణ, ఫలితాల విషయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నందున విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ ఏడాదికి డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల గురించి లాక్డౌన్ గడువు పూర్తయ్యాక ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. పరిస్థితులు అనూకూలిస్తే మే, జూన్లలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.
ఆ సెట్లు తృతీయ సంవత్సర ఫలితాల తర్వాతే..
డిగ్రీ పరీక్షలు, ఫలితాలపై సందిగ్ధత కారణంగా.. పీఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీఈ సెట్ల నిర్వహణపై గందరగోళం నెలకొంది. కామన్ పీజీ సెట్ను తృతీయ సంవత్సర ఫలితాల తర్వాతే జరుపనున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలు మే నెలలోపే పూర్తికావాలి.