త్వరలో 1000 ‘విజయ’ మొబైల్ ఔట్లెట్లు!
ABN , First Publish Date - 2020-06-04T08:48:06+05:30 IST
ఎంతో ప్రజాదరణ పొందిన విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేయడానికి మొబైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు పశు
బ్యాటరీతో నడిచే ఈ-కార్ట్స్ మొబైల్ పార్లర్ వాహనాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్/తార్నాక, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఎంతో ప్రజాదరణ పొందిన విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేయడానికి మొబైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. హైదరాబాద్ లాలాపేటలోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో విజయ ఈ-కార్ట్స్ మొబైల్ పార్లర్ వాహనాలను బుధవారం మంత్రి ప్రారంభించారు. మొదటి విడతగా బ్యాటరీతో నడిచే 15 వాహనాల(మొబైల్ ఔట్ లెట్స్)ను సబ్సిడీపై లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 100, పాత 10 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 10 చొప్పున మరో 100 బ్యాటరీతో నడిచే వాహనాల ద్వారా విజయ ఉత్పత్తులు విక్రయించనున్నట్లు మంత్రి తెలిపారు.
వీటిని త్వరలో వెయ్యి వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ వాహనం విలువరూ.2.25 లక్షలు కాగా, ఇందులో డెయిరీ 30 శాతం, లబ్ధిదారుడు 70 శాతం భరిస్తారని చెప్పారు. నూతన ఔట్లెట్ల ఏర్పాటు ద్వారా విజయ ఉత్పత్తుల విక్రయాలు పెరగడంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. హైవేలు, దేవాలయాలు, పర్యాటక తదితర ప్రాంతాల్లో నెల రోజుల్లో మరో 500 ఔట్లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇతర రాష్ర్టాలలో సైతం విజయ ఉత్పత్తులకు విశేష ఆదరణ ఉందన్నారు. సంస్థ ఉద్యోగులు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొేస్త వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాస రావు, తార్నాక కార్పొరేటర్ ఆలకుంట్ల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.