కృష్ణా జలాలపై కేసీఆర్ లోపభూయిష్ట విధానాలు
ABN , First Publish Date - 2020-06-19T09:49:38+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచితమైన విధానాలు, ఏకపక్షమైన పోకడలతో భవిష్యత్తులో రాష్ట్రం ఏడారిగా మారే ప్రమాదం ఉందని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి దుయ్యబట్టారు.
- పది రోజుల్లో కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ
- ‘ఆంధ్రజ్యోతి’తో నాగం జనార్దన్రెడ్డి
నాగర్కర్నూల్,జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచితమైన విధానాలు, ఏకపక్షమైన పోకడలతో భవిష్యత్తులో రాష్ట్రం ఏడారిగా మారే ప్రమాదం ఉందని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి దుయ్యబట్టారు. కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణను పది రోజుల్లో రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాం గ్రెస్ రాష్ట్ర కృష్ణా జలాల పరిరక్షణ కమిటీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా నాగం జనార్దన్రెడ్డి గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్తో కేసీఆర్కు ఉన్న లోపాయికారి ఒప్పందాల కారణంగా మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల భవితవ్యం డోలాయమానంలో పడటంతో పాటు నాగార్జునసాగర్ ద్వారా తెలంగాణలో సాగునీరు, హైదరాబాద్కు మంచినీరందించే పరిస్థితి దుర్భలంగా మారుతుందన్నారు.
రోజుకు పోతిరెడ్డిపాడు ద్వారా 7 టీఎంసీలు, సంగమేశ్వరాలయం వద్ద లిఫ్టు ద్వారా మరో 3 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రా ప్రాంతానికి మళ్లిస్తే మహాత్మాగాంధీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు దేనికీ పనికిరాకుండా పోతాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు, వెల్గొండ, హంద్రినీవా, గాలేరు నగరి లాంటి ప్రాజెక్టులన్నీ తెలంగాణలో ఏడారిగా మార్చేవేనని నాగం ఆవేదన వ్యక్తం చేశారు. జగన్, కేసీఆర్ల మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందాలపై ప్రజలకు వివరిస్తామన్నారు.