ఏనుగును చంపినవారి ఆచూకి చెబితే నజరానా
ABN , First Publish Date - 2020-06-04T22:58:07+05:30 IST
కేరళలోని మలప్పురం జిల్లాలో బాణసంచా కూర్చిన పైనాపిల్ను ఆహారంగా అందించి..
హైదరాబాద్ : కేరళలోని మలప్పురం జిల్లాలో బాణసంచా కూర్చిన పైనాపిల్ను ఆహారంగా అందించి.. గర్భంతో ఉన్న ఏనుగును వధించిన ఘటనపై బుధవారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ఇప్పటికే అటవి శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ ఘటనపై హైదరాబాద్లోని నేరేడ్మేట్కు చెందిన శ్రీనివాస్ అనే జంతు ప్రేమికుడు స్పందించారు. ఏనుగును చంపిన వారి ఆచూకీ చెబితే రూ. 2 లక్షలు నజరానా ఇస్తానని ఆయన ప్రకటించారు.
ఇంత అరాచకానికి దిగజారుతాడా..?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో గర్భిణి ఏనుగుని చంపిన ఘటన యావత్ భారత దేశాని కుదిపేసిందన్నారు. ‘మనిషి ఇంత అరాచకానికి దిగజారుతాడా..? అనే ఆలోచల అందరిలో కలిగించింది. లాక్ డౌన్ సమయంలో ఆహారం లేక అలమటిస్తున్న మూగ జీవాలకు తన సొంత గ్యారేజ్లో ఆహారం వండి నగర వ్యాప్తంగా పంపిణీ చేసే వారు ఒక వైపు ఉండగా.. మరోవైపు ఆహారంలో పేలుడు పదార్ధాలు పెట్టి జంతువులకు తినిపించే మానవ మృగాలు కూడా ఇదే సమాజంలో ఉన్నారు’ అని శ్రీనివాస్ మీడియా ముఖంగా ప్రకటించారు.