కాళేశ్వరంలో ‘మేఘా’ రికార్డు
ABN , First Publish Date - 2020-05-30T09:00:36+05:30 IST
కాళేశ్వరంలో ‘మేఘా’ రికార్డు
3,767 మెగావాట్ల సామర్థ్యంతో పంప్హౌజ్ల నిర్మాణం
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ‘మేఘా’ సంస్థ రికార్డు స్థాయిలో పనుల్ని చేపట్టింది. ఏకంగా 3,767 మెగావాట్ల సామర్థ్యం గల పంప్హజ్లను నిర్మించింది. ప్రాజెక్టులో కీలకమైన పనుల్ని రికార్డు సమయంలో పూర్తి చేసినట్టు మేఘా (ఎంఈఐఎల్) సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 22 పంపింగ్ కేంద్రాలలో 4,680 మెగావాట్ల సామర్థ్యం గల 96 యంత్రాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో 15 కేంద్రాల్లో నిర్మాణ పనులను తమ సంస్థ చేపట్టినట్లు పేర్కొంది. ఈ పంపింగ్ కేంద్రాల్లో 3,840 మెగావాట్ల సామర్థ్యంతో 89 యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. మూడేళ్లలోనే లింక్-1, లింక్-2లో ఎత్తిపోతల కేంద్రాలను పూర్తి చేసినట్టు వెల్లడించింది. కొండపోచమ్మ రిజర్వాయరు, పంప్హౌజ్లను కూడా తమ సంస్థనే నిర్మించినట్లు తెలిపింది. తమ సంస్థ చేపట్టిన 15 పంపింగ్ కేంద్రాల్లో భూ ఉపరితలం పైన 11, భూ అంతర్భాగంలో 4 నిర్మించినట్టు ప్రకటించింది. వీటిలో ఇప్పటికే 9 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయని పేర్కొంది. భూగర్భంలో నిర్మించిన వాటి సామర్థ్యం ఎక్కువని తెలిపింది. కాళేశ్వరం పథకంలో అతిపెద్ద విద్యుత్తు సరఫరా వ్యవస్థను నిర్మిస్తునట్టు ప్రకటించింది. రాష్ట్రం మొత్తం విద్యుత్తు సరఫరా వ్యవస్థ సామర్థ్యం 15,087 మెగావాట్లు కాగా, ఇందులో 25ు విద్యుత్తు సరఫరా సామర్థ్యం గల వ్యవస్థను కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిర్మించినట్టు తెలిపింది.