మత ఘర్షణలకు కేసీఆర్ కుట్ర
ABN , First Publish Date - 2020-07-14T08:26:39+05:30 IST
రాష్ట్రంలో కరోనా నియంత్రణలో విఫలమైన సీఎం కేసీఆర్ ప్రజల దృష్టిని మళ్లించడానికి
- అందుకే నల్లపోచమ్మ గుడి కూల్చివేత
- కాంగ్రెస్ కీలక నేతలూ భాగస్వాములే: అరుణ
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా నియంత్రణలో విఫలమైన సీఎం కేసీఆర్ ప్రజల దృష్టిని మళ్లించడానికి, మతఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. కరోనా కట్టడి విషయంలో బీజేపీ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న కేసీఆర్, శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు పథకం పన్నారన్నారు. ఇందులో కొంతమంది కాంగ్రెస్ కీలక నేతలూ ఉన్నారని ఆమె ఆరోపించారు. సచివాలయం ఆవరణలోని నల్లపోచమ్మ గుడి కూల్చివేత ఈ కుట్రలో భాగమే అని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాట్లాడుకునే.. ఈ గుడిని కూల్చివేశారని ఆరోపించారు. 2004 కంటే ముందు, సచివాలయం ఆవరణలో కేవలం నల్లపోచమ్మ ఆలయం మాత్రమే ఉండేదని, మసీదు లేదన్న సంగతిని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన, ధనార్జనే లక్ష్యంగా దోపిడీపర్వం కొనసాగుతోందని ఆమె ధ్వజమెత్తారు.