సరిపోను వయసుంటే కేటీఆర్ కుమారుడుకీ ఎమ్మెల్యే పదవి
ABN , First Publish Date - 2020-11-26T07:27:18+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి రాజకీయ కొలువులు పుష్పలంగా ఉన్నాయని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు కె.
లక్ష్మణ్
బౌద్ధనగర్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి రాజకీయ కొలువులు పుష్పలంగా ఉన్నాయని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కేటీఆర్ కుమారుడికి సరిపోను వయసు లేదని, ఒకవేళ వయసుంటే ఎంపీనో, ఎమ్మెల్యే పదవో కట్టబెట్టేవారని ఎద్దేవా చేశారు. బుధవారం బౌద్ధనగర్ డివిజన్లోని జామైఉస్మానియా, వారాసిగూడ, బౌద్ధనగర్ తదితర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తండ్రీకొడుకులిద్దరూ తోడుదొంగలని, ఆరేళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికో కొలువు అని హామీ ఇచ్చి విస్మరించారని, కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం రాజకీయ ఉద్యోగాలను నింపుకొంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్లో చెల్లని రూపాయి అని, అయినా దొడ్డిదారిన పదవిని దక్కించుకున్నారని ఆరోపించారు.