సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు
ABN , First Publish Date - 2020-06-19T10:41:41+05:30 IST
తెలంగాణలోని రైతుల పంటలతో పాటు ఇతర రాష్ట్రాల పంట ఉత్పత్తులనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు.
- మహిళా రైతుకు పట్టా పాసు పుస్తకాన్ని అందిస్తున్న మంత్రి హరీశ్
- ఇతర రాష్ట్రాల పంటలూ కొనుగోలు: హరీశ్
నంగునూరు, జూన్ 18: తెలంగాణలోని రైతుల పంటలతో పాటు ఇతర రాష్ట్రాల పంట ఉత్పత్తులనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. సకాలంలో రైతులకు వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేశామని తెలిపారు. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే రైతుల పంటలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. బిహార్, ఛత్తీసగఢ్ రాష్ట్రాల నుంచి మక్కలు, ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. పెట్టుబడి కోసం రైతుబంధు కింద రూ.7 వేల కోట్లు కేటాయించామని, వారం రోజుల్లో ఆ డబ్బులు రైతులకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.