ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
ABN , First Publish Date - 2020-03-21T10:16:10+05:30 IST
కరోనా తీవ్రత పెరగడం, బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ నివారణకు
ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లనక్కర్లేదు
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం
హైదరాబాద్ సిటీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కరోనా తీవ్రత పెరగడం, బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ నివారణకు రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా ఐటీ విభాగంతో కలిసి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయని ఆర్టీఏ ఉన్నతాధికారి తెలిపారు. పూర్తిగా కంప్యూటరీకరణ ద్వారానే వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా సాఫ్ట్వేర్ను రూపొందించనున్నారు.
వాహనాదారులకు సులువుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియడంతో పాటు వైర్సను అరికట్టేందుకు ఇదే ఉత్తమమైన మార్గమని అధికారులు భావిస్తున్నారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం యజమాని ఆర్టీఏ కార్యాలయంలో ఫొటో, డిజిటల్ సంతకం, వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. వేలి ముద్రల వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రతిరోజు 4-5వేల వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెసులుబాటు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టంలోనే ఉంది.