అహింసామార్గం.. విశ్వశాంతికి దోహదం
ABN , First Publish Date - 2020-12-26T05:07:10+05:30 IST
అహింసామార్గం.. విశ్వశాంతికి దోహదం
ప్రపంచ ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ
కడ్తాల్లో ఐదో రోజుకు చేరిన ధ్యాన మహోత్సవాలు
ఆమనగల్లు : అహింసామార్గం విశ్వ మానవాళి శాంతికి దోహదం చేస్తుందని ప్రపంచ ధ్యాన గురువు, పిరమిడ్ స్పిరుచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ అన్నారు. కడ్తాల్ మండలం కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్లో మహిళా ధ్యాన మహాచక్రం -2 వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈవేడుకల్లో ఐదో రోజైన శుక్రవారం పత్రీజీ సామూహిక వేణునాద ధ్యానంతో వేడుకలు మొదలయ్యాయి. మూడు గంటల పాటు పత్రీజీ వేణునాద ధ్యానం లో ధ్యానులు, సందర్శకులు లీనమయ్యారు. అనంతరం పత్రీజీ సందేశమిచ్చారు. మనం ఇతర జీవుల పట్ల ప్రేమ, దయ చూపకపోతే మనం ఎప్పుడూ ఎవరి వద్ద నుంచి ఆ రెండింటినీ పొందలేమన్నారు. మనదేశంలో మొదలైన ధ్యాన, శాఖాహార విప్లవాన్ని విశ్వవ్యాప్తం చేయాలని, అందుకు ధ్యాన మాస్టర్లు కంకణబద్ధులు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. అనంతరం వివిధ ధ్యాన, ఆధ్యాత్మిక పుస్తకాలను పత్రీజీ ఆవిష్కరించారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల క్రిస్మస్ తాతయ్య, ఏసుప్రభువు వేషధారణలు అందరినీ అలరించాయి. ఏసు బోధనలు అందరికీ అనుసరణీయమని పత్రీజీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ వైస్ చైర్మన్ కొర్పోలు విజయభాస్కర్రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ రాంబాబు, సభ్యులు దామోదర్, సాంబశివరావు, నంద ప్రసాద్, ప్రేమయ్య, హన్మంత రాజు, సురేష్ బాబు, మాధవి, లక్ష్మీ, నవకాంత్, పీఆర్వో రవి శాస్త్రి, జ్యోతిరెడ్డి, దీప్తిరెడ్డి పాల్గొన్నారు. ఫిరమిడ్ ఆవరణలోని సభా వేదికపై క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పత్రీజీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.