రైళ్లు.. పట్టాలెక్కేనా?
ABN , First Publish Date - 2020-04-05T12:57:00+05:30 IST
రైళ్లు.. పట్టాలెక్కేనా?
- మొదలైన టికెట్ బుకింగ్లు
- 14న ముగియనున్న లాక్డౌన్
- 15 నుంచి రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ చర్యలు
- ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రయాణికులు
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ మహమ్మారి కాకవికలం చేస్తున్న వేళ జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త లాక్డౌన్ ఈ నెల 14న ముగియనుంది. ఈ నేపథ్యంలో 15 నుంచి దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను ప్రారంభించేందుకు రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించిన్నట్టు తెలిసింది. ఈ మేరకు మరో పది రోజుల్లో వైరస్ తీవ్రతను బట్టి ఆయా రైల్వేలైన్ వెంట 4నుంచి ఐదు రైల్లు నడిపించి దూరప్రాంత ప్రయాణికులకు కొంత ఊరట కల్పించనన్నుట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రైల్వే అధికారులు రైల్వే నిర్వహణకు సంబంధించిన పనులను ఇప్పటి నుంచే ప్రారంభించారు.
బుకింగ్లు ప్రారంభం: లాక్డౌన్ అనంతరం ఈ నెల 15 నుంచి రైళ్లు నడిపిస్తే ప్రయాణికులంతా ఒకేసారి ఎగబడుతారని, తద్వారా మళ్లీ రైళ్లలో కిక్కిరిసి వెళ్తారనే భావనతో ముందస్తు బుకింగ్లు చేయించుకుంటున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ రెండు రోజుల నుంచే దేశవ్యాప్తంగా నడిచే పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించిన బుకింగ్లు ఐఆర్సీటీసీ ద్వారా చేపడుతున్నారు. రాజధాని, తెలంగాణ, గోదావరి, చార్మినార్, కేఎ్సఆర్ బెంగళూర్ తదితర సూపర్ ఫాస్ట్ రైళ్లలో బుకింగ్లు 90శాతం పూర్తయ్యాయి.
భోగీలను శుభ్రం చేస్తున్న సిబ్బంది: మరో పది రోజుల్లో రైళ్లు ప్రారంభంకానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేలో రాకపోకలు సాగించే రైళ్లను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. ఇప్పటికే భోగీలను, బెర్త్లను శానిటైజర్ ద్రావణంతో శుభ్రం చేసిన సిబ్బంది మరోమారు వాటిని శుభ్రం చేస్తున్నారు. ఇంజన్లోని ఆపరేటింగ్ పరికరాలను సైతం ఒక్కొక్కటిగా క్లీనింగ్ చేస్తున్నారు. 15 నుంచి రైళ్లు నడుస్తాయని ప్రయాణికులు ఆశతో ఎదురుచూస్తున్నారు.