ఆ భూముల వెనక లావాదేవీలు జరిగాయా?
ABN , First Publish Date - 2020-08-18T08:08:59+05:30 IST
సాధారణ కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగంలో చేరిన నాగరాజు ఎమ్మార్వో స్థాయికి ఎదిగి కో
- ఆర్టీఐ దరఖాస్తుల ఆధారంగా కాంగ్రెస్ నేతపై ఏసీబీ ఆరా
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): సాధారణ కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగంలో చేరిన నాగరాజు ఎమ్మార్వో స్థాయికి ఎదిగి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడటంపై ఏసీబీ లోతుగా విచారణ జరుపుతోంది. గతంలో అక్రమాస్తుల కేసు నమోదు చేసినా సులువుగా బయటపడటంతో... ఈసారి పక్కాగా ఆధారాలు సంపాదించి కేసు బిగించేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భూ వివాదం కేసులో రూ.2 కోట్లు డిమాండ్ చేసి రూ. కోటీ పది లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నాగరాజు కేసులో ఏసీబీ దర్యాప్తు ఊపందుకుంది. తనిఖీల్లో దళారి అంజిరెడ్డి వద్ద లభించిన ఆర్టీఐ పత్రాల ఆధారంగా ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన భూములకు సంబంధించిన సమాచారం ఆర్టీఐ పత్రాల్లో ఉంది. సూరారం, జీడిమెట్ల, దూలపల్లితోపాటు ఇతర ప్రాంతాల్లో పలు సర్వే నెంబర్లకు సంబంధించిన సమాచారం సేకరించారు. దీంతో ఆయా భూముల క్రయ, విక్రయాల్లో ఏవైనా లావాదేవీలు జరిగాయా అనే కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఏవైనా కేసులు నమోదు అయ్యాయా అనే వివరాల్ని కూడా ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. పదుల సంఖ్యలో లభించిన ఆర్టీఐ పత్రాల్లో అన్నీ భూములకు సంబంధించినవే ఉండటంతో... వాటిపై దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పేరుతో ఆర్టీఐ దరఖాస్తులు ఉండటంపై కూడా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నాగరాజుతోపాటు సహ నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోమవారం సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు. భూములకు సంబంధించిన పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితుల్ని కస్టడీకి అనుమతివ్వాలని ఏసీబీ ప్రత్యేక కోర్టులో సోమవారం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సోదాల్లో లభించిన పత్రాలు, కాంగ్రెస్ నాయకుడి పత్రాలు వీరి వద్ద ఎందుకు ఉన్నాయనే సమాచారంతోపాటు ఇతర నగదు లావాదేవీలపై ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో విచారించి సమాచారం రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు.