సామర్థ్యం ఫుల్‌.. టెస్ట్‌లు డల్‌!

ABN , First Publish Date - 2021-04-25T09:01:48+05:30 IST

కరోనా విజృంభణతో టెస్ట్‌ల కోసం ప్రజలు క్యూలు కడుతున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకూ పరీక్షలెక్కడ చేస్తున్నారన్న వెతుకులాటతో అంతా ఇబ్బందులు పడుతున్నా ఆరోగ్యశాఖ స్పందించడం లేదు. సామర్థ్యం భారీగా ఉన్నా టెస్ట్‌ల సంఖ్యను పెంచకుండా చోద్యం చూస్తోంది.

సామర్థ్యం ఫుల్‌.. టెస్ట్‌లు డల్‌!

  • కరోనా పరీక్షలు పెంచని ప్రభుత్వం
  • లక్ష చేసే వీలున్నా 45 వేలతో సరి 
  • మొన్నటివరకూ 30వేల మందికే..
  • ప్రజల గగ్గోలు, మీడియా ఒత్తిళ్లతో 
  • ప్రస్తుతానికి మరో 10 వేలు పెంపు 
  • 15 ప్రభుత్వ, 45 ప్రైవేటు ల్యాబ్‌లు 
  • 24 గంటల్లో లక్ష టెస్టులు చేసే సామర్థ్యం
  • సద్వినియోగం చేసుకోని ఆరోగ్య శాఖ 
  • ప్రజల్ని దోచుకుంటున్న ప్రైవేటు ల్యాబ్‌లు

కొవిడ్‌ పరీక్షల విషయంలో ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. రాష్ట్రంలో రోజుకు లక్ష టెస్ట్‌లు చేసే సామర్థ్యం ఉన్నా 45వేలతోనే సరిబుచ్చుతోంది. ఇదే అదనుగా వైరస్‌ భయంతో వణుకుతున్న ప్రజలను ప్రైవేటు ల్యాబ్‌లు అడ్డంగా దోచుకుంటున్నాయి. పరీక్షలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే మూడురెట్లు అదనంగా వసూలు చేస్తున్నా ఆరోగ్యశాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

కరోనా విజృంభణతో టెస్ట్‌ల కోసం ప్రజలు క్యూలు కడుతున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకూ పరీక్షలెక్కడ చేస్తున్నారన్న వెతుకులాటతో అంతా ఇబ్బందులు పడుతున్నా ఆరోగ్యశాఖ స్పందించడం లేదు. సామర్థ్యం భారీగా ఉన్నా టెస్ట్‌ల సంఖ్యను పెంచకుండా చోద్యం చూస్తోంది. రాష్ట్రంలో 13జిల్లాల్లో కలిపి 14 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉన్నాయి. తిరుపతిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌ ఉంది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, ప్రైవేటు ల్యాబ్‌లు మరో 45వరకూ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు 170 ట్రూనాట్‌ మిషన్లు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ ఉపయోగించి రోజూ దాదాపు లక్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపినా టెస్ట్‌ల సంఖ్య 45వేలు దాటడం లేదు.


మొన్నటి వరకూ 30- 31వేల మందికి మాత్రమే పరీక్షలు చేసేవారు. ప్రజలు గగ్గోలు పెట్టడం, మీడియా ఒత్తిడి చేయడంతో ఇప్పుడు వాటి సంఖ్య 45వేలకు చేరింది. రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో లక్షమంది నుంచి శాంపిల్స్‌ తీసుకుని ఒక్కరోజులో రిపోర్టు ఇచ్చే వ్యవస్థ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత భారీగా టెస్టులు చేస్తే కేసుల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన ప్రభుత్వానికి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టెస్టులు తగ్గించడమే మేలని ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చిన సలహా మేరకు ప్రభుత్వం వాటి సంఖ్యను పెంచకుండా ప్రజారోగ్యంతో చెలగాటమాడుతోంది. రాష్ట్రంలోని 15 ప్రభుత్వ ల్యాబ్‌ల్లో ప్రస్తుతానికి రెండు షిఫ్ట్‌ల్లో మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీటి సామర్థ్యం ప్రకారం 3షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి 4గంటలకు ఒక బ్యాచ్‌కు సంబంధించిన శ్యాంపిల్స్‌ టెస్ట్‌ చేయవచ్చు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో 15 ల్యాబ్‌ల్లో కలిపి దాదాపు 45వేల వరకూ నమూనాలు పరీక్షించవచ్చు. రాత్రి మరో 20వేల శాంపిల్స్‌ టెస్ట్‌ చేసే సామర్థ్యం ఉంది. గతంలో 96(ఒక బ్యాచ్‌) శాంపిల్స్‌ టెస్ట్‌ చేయాలంటే 6నుంచి 8గంటల సమయం పట్టేది.


ఇప్పుడు కేవలం 4గంటల్లో ఒక బ్యాచ్‌ రిపోర్టులు వచ్చే వ్యవస్థ ఉంది. అంటే 15 ల్యాబ్‌లు 24గంటలు పనిచేస్తే రోజుకు 6 షిఫ్ట్‌ల్లో కూడా టెస్టులు చేసే అవకాశం ఉంది. అయితే సిబ్బంది కొరతతో ప్రభుత్వం కేవలం రెండు షిఫ్ట్‌లతో మాత్రమే శాంపిల్స్‌ టెస్ట్‌ చేయిస్తోంది. ఇవికాకుండా 45 ప్రైవేటు ల్యాబ్‌ల్లో రోజుకు 20వేల వరకూ శాంపిల్స్‌ పరీక్షించవచ్చు. ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు. మొదటి విడతలో ప్రైవేటు ల్యాబ్‌ల్లో ప్రభుత్వానికి సంబంధించిన శాంపిల్స్‌ కూడా పంపించి టెస్టులు చేసేవారు. ఇప్పుడు వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. 


ట్రూనాట్‌ వాడరెందుకు?

కరోనా మొదటి దశలో టెస్టులు చేయడానికి ట్రూనాట్‌ మిషన్లు ఎక్కువగా ఉపయోగించేవారు. రూరల్‌ ప్రాంతాల్లో తీసిన శాంపిల్స్‌ ప్రధాన ల్యాబ్‌ల వరకూ రాకుండా అక్కడే రిపోర్టులు ఇచ్చేవారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 170 ట్రూనాట్‌ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో గంటకు 2శాంపిల్స్‌ టెస్ట్‌ చేయవచ్చు. రోజుకు 4వేల నుంచి 4,500 శాంపిల్స్‌ ట్రూనాట్‌ ద్వారా టెస్టు చేసే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యశాఖ వీటినీ పట్టించుకోవడం లేదు. టెస్టింగ్‌లో భాగంగా ట్రూనాట్‌ మిషన్లును కూడా ఉపయోగించాలని వైద్యులు కోరుతున్నారు. 


పిండేస్తున్న ప్రైవేటు ల్యాబ్‌లు 

టెస్టుల సంఖ్య పెంచకపోవడంతో ప్రైవేటు దోపిడీ భారీగా పెరిగింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు ప్రభుత్వం రూ.499గా ధర నిర్ణయిస్తే... ప్రైవేటు ల్యాబ్‌ల్లో కొత్త రేట్లు నిర్ణయించారు. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కు రూ.499 తీసుకుంటూనే... అత్యవసరం అయితే మరో రూ.500... రిపోర్టు 24గంటల్లో కావాలంటే మరో రూ.500 చెల్లించాలంటూపిండుతున్నారు. మొత్తంగా ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు రూ.1,500 వరకూ వసూలు చేస్తున్నారు. విజయవాడ బందర్‌ రోడ్డు సమీపంలో ఉన్న ఒక ల్యాబ్‌ నిర్వాహకులు టెస్టుల పేరుతో రూ.వేలు వసూలు చేస్తున్నా ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 


పీహెచ్‌సీల్లోనే మగ్గుతున్న శాంపిల్స్‌ 

రూరల్‌ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణం గా ఉంది. అనుమానితుల నుంచి పీహెచ్‌సీల్లో శాం పిల్స్‌ తీసుకుంటున్నా అవి సమయానికి ల్యాబ్‌కు చేరడం లేదు. తగిన యంత్రాంగం లేకపోవడంతో అవి రెండు, మూడు రోజుల పాటు అక్కడే ఉండిపోతున్నాయి. దీంతో రిపోర్టు రావడానికి దాదాపు 5 రోజులు పడుతోంది. అనుమానితులకు పాజిటివ్‌ ఉంటే రిపోర్టు వచ్చే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఉదయం తీసుకున్న శాంపిల్స్‌ మధ్యాహ్నానికి, మధ్యాహ్నం తీసుకున్న శాంపిల్స్‌ సాయంత్రానికి ల్యాబ్‌కు చేరే ఏర్పాట్లు చేయాలని పీహెచ్‌సీల వైద్యులు కోరుతున్నారు. 



Updated Date - 2021-04-25T09:01:48+05:30 IST