ఆర్బీకేలే ధాన్యం సేకరణ కేంద్రాలు
ABN , First Publish Date - 2021-11-02T07:58:17+05:30 IST
‘‘రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో మోసాలను నివారించే చర్యల్లో భాగంగా మిల్లర్ల పాత్రను తీసేస్తున్నాం. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉంటాయి.
- ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తొలగిస్తున్నాం
- ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసీల అమలు
- మినహాయింపులు లేకుండా రైతుకు కనీస మద్దతు ధర: సీఎం జగన్
అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో మోసాలను నివారించే చర్యల్లో భాగంగా మిల్లర్ల పాత్రను తీసేస్తున్నాం. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉంటాయి. రైతు ముంగిట (ఫాంగేట్ వద్దే) కొనుగోళ్లు జరుగుతాయి. సొమ్ము చెల్లింపుల్లో తప్పిదాలు, మోసాలు లేకుండా, వేగంగా పేమెంట్ చేయడానికి ఈ-క్రాప్ బుకింగ్, ఈ-కేవైసీలను అమలు చేస్తున్నాం. ఆధార్ నంబరు ఆధారంగానే చెల్లింపులు జరుగుతాయి. రైతులకు మేలు చేసేలా కొత్త విధానంలోకి వెళ్తున్నాం. రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ఈ చర్యలు చేపడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ధాన్యం సేకరణపై మంత్రుల బృందంతో కలసి ఆయన సమీక్షించారు. ‘‘ధాన్యం సేకరణలో అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఉండకూడదు.
అవినీతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండకూడదు. ధాన్యం నాణ్యత నిర్ధారించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ధాన్య సేకరణ వివరాల బోర్డులను ఆర్బీకేల్లో ఉంచాలి’’ అని అధికారులను సీఎం ఆదేశించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, కొడాలి నాని, శ్రీరంగనాథరాజు, సీఎస్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.