సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వెనుక...!

ABN , First Publish Date - 2021-06-07T07:57:05+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన సోమవారం ఢిల్లీకి వెళ్లాలనుకున్నప్పటికీ...

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వెనుక...!

  • ఖరారు కాని కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు
  • తొలుత రమ్మని... తర్వాత రద్దు చేసిన అమిత్‌షా?
  • గురువారమైనా సమయమివ్వాలని వినతి
  • ‘జల’ మంత్రి నుంచి మాత్రమే సానుకూలత
  • నేడు నేరుగా రంగంలోకి వైసీపీ ఎంపీలు
  • అపాయింట్‌మెంట్‌ కోసం లాబీయింగ్‌!


న్యూఢిల్లీ/అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన సోమవారం ఢిల్లీకి వెళ్లాలనుకున్నప్పటికీ... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ల అపాయింట్‌మెంట్లు ఖరారు కాలేదు. జల వనరుల శాఖ మంత్రి షెకావత్‌ మాత్రమే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ ఒక్కరిని కలిసేందుకైనా సీఎం ఢిల్లీ వెళతారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, కేంద్ర మంత్రులు ‘బిజీ’గా ఉన్నందున ముఖ్యమంత్రి జగన్‌ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారంటూ ఆదివారం సాయంత్రం వైసీపీ వర్గాలు వెల్లడించాయి. నిజానికి... సోమవారం అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, సమయం ఇవ్వడం కుదరదని ఆదివారం సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో... కనీసం గురువారమైనా అపాయింట్‌మెంట్‌ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కోరాయి. దీనిపై హోంశాఖ స్పందన కోసం ఎదురు చూస్తున్నాయి.


ఎంపీల రాయబారం...

అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌తో సహా ఇతర మంత్రుల అపాయింట్‌మెంట్‌ లభించేలా వైసీపీ ఎంపీలు నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఎంపీతోపాటు... మరికొందరు సోమవారం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలిసింది. వీరు నేరుగా ఆయా కేంద్ర మంత్రుల కార్యాలయాలకు వెళ్లి... అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం.

Updated Date - 2021-06-07T07:57:05+05:30 IST