పోలవరంలో డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభం
ABN , First Publish Date - 2021-08-10T09:39:22+05:30 IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం పనులకు అవసరమయ్యే దిగువ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు సోమవారం...
పోలవరం, ఆగస్టు 9: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం పనులకు అవసరమయ్యే దిగువ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. మేఘా కంపెనీ ప్రెసిడెంట్ రంగరాజన్, జలవనరుల శాఖ డీఈఈ ఎంకేడీవీ ప్రసాద్, మేఘా జీఎం ముద్దుకృష్ణ, దేవ్ మణిమిశ్రా, ఏజీఎం రాజేశ్, కో ఆర్డినేటర్ ఠాగూర్చంద్ తదితరులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో దిగువ కాఫర్ డ్యాం పనులనూ వేగవంతం చేస్తున్నారు. కాఫర్ డ్యాంలకు లోపలి వైపు పది మీటర్ల నదీ గర్భం నుంచి దిగువన 10 మీటర్ల లోతున.. 1.2 మీటర్లు వెడల్పు, 96 మీటర్ల పొడవున డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికే దిగువ కాఫర్ డ్యాంలో దాదాపు 63 వేల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తి చేశారు. ఎగువ కాఫర్ డ్యాం 2,480 మీటర్ల పొడవున 42.5 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉండగా.. దిగువ కాఫర్ డ్యాంను 1,613 మీటర్ల పొడవున, 30.50 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉంది.